హైదరాబాద్: లార్డ్స్ వేదికగా ఆదివారం జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో టీమిండియా 9 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఫైనల్లో భారత్ ఓటమి పాలైనా... భారత మహిళా క్రికెటర్లు సగటు భారత క్రికెట్ అభిమాని మనసు గెలుచుకున్న సంగతి తెలిసిందే.
దీనిపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంటే ప్రముఖ క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ మాత్రం తన ట్విట్టర్ ఖాతాలో వ్యంగ్యంగా స్పందించాడు. అంతేకాదు ఫైనల్లో భారత మహిళల ప్రదర్శన ఏమంత గొప్పగా లేదని అన్నాడు.

'మిథాలీ రాజ్ శుభారంభం చేసి ఉంటే, హర్మన్ ప్రీత్ ఒకటి, రెండు పరుగులపై దృష్టి పెట్టి ఉంటే, వేదా శర్మ తొందర పడకుండా ఉంటే' అంటూ తనదైన శైలిలో ట్విట్టర్లో విమర్శలు చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది.
అనంతరం 229 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌటైంది. చివర్లో తీవ్ర ఒత్తిడికి గురైన భారత మహిళల జట్టు గెలుపు ముంగిట బోల్తా పడింది. అయితే టోర్నీ అసాంతం అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియాను విమర్శించిన మంజ్రేకర్పై నెటిజన్లు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
అసలు నువ్వు ఏ స్టేజ్ లోనైనా క్రికెట్ ఆడావా? నాకు నువ్వు క్రికెట్ ఆడినట్లు గుర్తులేదు. నువ్వు కేవలం వ్యాఖ్యాతగా మాత్రమే తెలుసు అని ఒక అభిమాని విమర్శించగా, ముందు బీసీసీఐ మహిళా క్రికెట్ను పట్టించుకుని ఉంటే అప్పుడు విమర్శించినా ఫర్వాలేదు అని మరో అభిమాని మండిపడ్డాడు.
భారత మహిళా జట్టు ఫైనల్కు చేరిన తీరును అభినందించకుండా, ఎందుకు వర్రీ అవుతున్నావ్ అంటూ మరొకరు చురకలంటించారు. నువ్వు రిటైర్మెంట్ తీసుకున్నట్లయితే.. నీ వాగుడుకు మూత పడుతుంది అని మరొక అభిమాని మంజ్రేకర్పై కాస్తంత ఘాటుగానే స్పందించారు.