
పూణే: ఇంగ్లండ్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా బ్యాటింగ్ శైలిపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మండిపడ్డాడు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు పిచ్, మైదానం పరిస్థితులతో పాటు ప్రత్యర్థి బ్యాటింగ్ బలాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నాడు. ఈ ఫలితంతో కోహ్లీసేన ఒక పాఠం నేర్చుకుందని పేర్కొన్నాడు. రెండో వన్డే అనంతరం మంజ్రేకర్ వరుస ట్వీట్లు చేస్తూ.. టీమిండియా లోపాలను ఎత్తిచూపాడు.
రెండో వన్డేలో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగుల భారీ స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ (108; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) శతక్కొట్టగా.. రిషబ్ పంత్ (40 బంతుల్లో 77; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. విరాట్ కోహ్లీ (66), హార్దిక్పాండ్యా (35) ఆకట్టుకున్నారు. భారీ లక్ష్యాన్ని ఇంగ్లండ్ అలవోకగా ఛేదించింది. జానీ బెయిర్స్టో (124; 11 ఫోర్లు, 7 సిక్సర్లు), బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 99; 4 ఫోర్లు, 10 సిక్సర్లు) దంచి కొట్టడంతో నాలుగు వికెట్లు కోల్పోయి కేవలం 43.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ నేపథ్యంలోనే సంజయ్ మంజ్రేకర్ టీమిండియా బ్యాటింగ్పై విమర్శలు గుప్పించాడు.
'ఒక లక్ష్యాన్ని నిర్దేశించే ముందు అన్ని చూసుకోవాలి. పిచ్, మైదాన పరిస్థితులతో పాటు ప్రత్యర్థి బలమైన బ్యాటింగ్ లైనప్ను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఫలితంతో టీమిండియా ఒక పాఠం నేర్చుకుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం.. తొలి వన్డే మ్యాచ్లో శార్దూల్ ఠాకూర్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డుకు అర్హుడు. అతడు ఆ మ్యాచ్లో మూడు వికెట్లు తీయకపోతే.. అప్పుడు కూడా ఇలాంటి ఫలితమే నమోదయ్యేది' అని సంజయ్ మంజ్రేకర్ ట్వీట్ చేశాడు.
'ఈరోజు అదే బ్యాటింగ్ పిచ్పై మోయిన్ అలీ 10 ఓవర్లు బౌలింగ్ చేసి 47 పరుగులే ఇచ్చాడు. ఈ గణాంకాలు అతడు అద్భుతంగా బౌలింగ్ చేశాడని కాదు. టీమిండియా అతడిపై ఎదురుదాడి చేయలేకపోవడం అని అంటున్నా. మిడిల్ ఓవర్లలో అలీ బౌలింగ్లో ఎవరూ ఎదురుదాడికి దిగలేదు. ఇలాంటి బ్యాటింగ్ పిచ్పై భారత్ చేసిన పెద్ద తప్పుగా దీన్నే భావించొచ్చు' అని ప్రముఖ వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ మరో ట్వీట్లో పేర్కొన్నాడు. కుల్దీప్ యాదవ్ నెమ్మదిగా బౌలింగ్ చేశాడని, అతను బౌలింగ్ చేసిన లైన్ తనకు బాగా నచ్చిందన్నాడు. కుల్దీప్ అంతగా చెత్తగా బౌలింగ్ చేశాడని అనుకోవడం లేదని ఆయన తెలిపాడు. వన్డే చరిత్రలో టీమిండియాపై ఇంగ్లండ్కిదే అత్యుత్తమ భారీ ఛేదన.