IPL 2025 RCB: ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) అంచనాలు మించి అదరగొడుతోంది. ఎట్టకేలకు విన్నింగ్ ఫార్మూలాను కనుగొని.. ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచుల్లో 7 విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఇందులో బయట స్టేడియాల్లో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఆర్సీబీ విజయం సాధించడం విశేషం. ముఖ్యంగా ఈ మ్యాచ్ విజయాలన్నింటిలోనూ ఫామ్ లో ఉన్న స్టార్ బ్యాటర్ కోహ్లీ కూడా కీలకంగా వ్యవహరించాడు. ఇప్పటివరకు ఆరు హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు.
అయితే తాజాగా ఆర్సీబీ విజయాల వెనక ఉన్నది ఎవరో చెప్పాడు మాజీ క్రికెటర్ మంజ్రేకర్. ఇకపై జట్టు ఒక్కడిపైనే ఆధారపడాల్సిన అవసరం లేదని అన్నాడు. రీసెంట్ గా మంజ్రేకర్ విడుదల చేసిన ఐపీఎల్ 2025 టాప్ 10 బ్యాటర్ల జాబితాలో కోహ్లీ పేరు లేదు. ఇప్పుడేమో ఒక్కడిపైనే ఆర్సీబీ ఆధారపడాల్సిన అవసరం లేదంటూ పరోక్షంగా కోహ్ల గురించి ప్రస్తావించాడు.

ఆర్సీబీ విజయాల కారణం వాళ్లే..
ఆర్సీబీ 10 మ్యాచుల్లో ఈ 7 విజయాలు సాధించడానికి ఆరుగురు ఆటగాళ్లని చెప్పాడు మంజ్రేకర్. ముఖ్యంగా ఆర్సీబీ బౌలర్ల వల్లే ఈ విక్టరీస్ సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు. ఆర్సీబీ బౌలింగ్ యూనిట్ ప్రత్యర్థి జట్లను తక్కువ స్కోరుకు కట్టడి చేయడమే.. ఆ జట్టు విజయాల్లో కీలకంగా మారిందని అభిప్రాయపడ్డాడు.
"ఆర్సీబీ ఎట్టకేలకు విన్నింగ్ ఫార్మూలను తెలుసుకుంది. ఇకపై ఆర్సీబీ ఒకరిపై ఆధారడే జట్టు కాదు. 7 విజయాలు, ఆరుగురు ప్లేయర్స్ ఆఫ్ ది మ్యాచ్. టీమ్ లో ఆర్సీబీ అందుకున్న 7 విజయాల్లో నాలుగు ఛేజింగ్ లో వచ్చినవే. వారు ఛేజ్ చేసిన లక్ష్యాలు.. 174, 175, 157, 162. స్పష్టమైన తేడా ఇక్కడ కనిపిస్తోంది. ఈ విజయాలకు కారణం.. వాళ్ల బౌలింగ్ యూనిట్." అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు.
ఆ నాలుగు జట్లు బౌలింగ్ వల్లే..
ఈ సీజన్ లోని బెస్ట్ బౌలింగ్ అటాక్స్ ఉన్న జట్లు పాయింట్ల పట్టికలో టాప్ 4లో ఉన్నాయని చెప్పాడు మంజ్రేకర్. "గుజరాత్ టైటాన్స్, దిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ టాప్ 4లో ఉన్నాయి. బ్యాటర్లు బానే రాణించారు. కానీ ఈ పాయింట్లు బౌలర్లు సాధించినవే." అని మంజ్రేకర్ అన్నాడు.