
హైదరాబాద్: జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ(జేఎన్యూ)లో గత ఆదివారం రాత్రి విద్యార్థులతో పాటు ప్రొఫెసర్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. క్యాంపస్లోని 50 మంది గుర్తు తెలియని దుండగులు ఒక్కసారిగా ప్రవేశించి దాడులు చేస్తూ, స్వైరవిహారం చేశారు. ముసుగులు ధరించి విద్యార్థులు, ప్రొఫెసర్లపై రాళ్లు, కర్రలతో దొరికిన వారిని దొరికినట్లు చితకబాదారు.
ఈ దాడిలో జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో జేఎన్యూ దాడిని దేశంలోని సాధారణ ప్రజలతో సహా అన్ని రంగాల వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఈ నేపథ్యంలో గాయపడిన విద్యార్థులకు సంఘీభావంగా ముంబైలోని గేట్వే ఆఫ్ ఇండియా వద్ద పెద్ద నిరసన కార్యక్రమం జరిగింది.
ఈ నిరసన కార్యక్రమానికి సంబంధించిన కొన్ని ఫోటోలను తన ట్విట్టర్లో పోస్టు చేసిన క్రికెట్ కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ "వెల్డన్ ముంబై" అని పేర్కొంటూ ట్విటర్లో ట్వీట్ చేశారు. మంజ్రేకర్ ట్వీట్పై స్పందించిన బీజేపీ నేత, ఒలింపిక్స్ విజేత యోగేశ్వర్ దత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
గేట్వే ఆఫ్ ఇండియా వద్ద జరిగిన నిరసన ప్రదర్శనలో ఒక యువతి 'ఫ్రీ కశ్మీర్' అనే ప్లకార్డును ప్రదర్శించిందని, ఆ ఫొటోను జత చేసిన యోగేశ్వర్, మంజ్రేకర్పై మండిపడ్డారు. "ఇదే నిరసనలో 'ఫ్రీ కశ్మీర్' అనే ప్లకార్డు కనిపించడం కూడా నిజమే. ఇలాంటి వారి గురించి ఏమంటావ్?మంజ్రేకర్" అని ప్రశ్నించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే జేఎన్యూ విద్యార్థులకు, అధ్యాపకులకు సంఘీభావం ప్రకటించిన సంగతి తెలిసిందే. క్యాంపస్లో ఆదివారం రాత్రి జరిగిన దాడి పట్ల ఆమె విద్యార్థులకు సానుభూతి వ్యక్తం చేశారు. జేఎన్యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషే ఘోష్ను కలిసి ఆమె నిబ్బరానికి చేతులు జోడించి నమస్కారం చేశారు.