హైదరాబాద్: గత కొంతకాలంగా టెస్టుల్లో టీమిండియా వరుస విజయాలతో దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే. అటు స్వదేశంలో వరుస సిరీస్లను గెలవడంతో పాటు విదేశీ పర్యటనల్లో భాగంగా వెస్టిండీస్, శ్రీలంక జట్లపై సైతం సిరీస్ లను కూడా సొంతం చేసుకుంది.
మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్కు కోహ్లీ సేన సాధిస్తున్న విజయాలు అంతగా రుచిస్తున్నట్లు లేదు. భారత్ ఏకపక్షంగా గెలిచేస్తుండటం అభిమానుల్లో మ్యాచ్ల పట్ల ఆసక్తిని తగ్గిస్తోంది. ముఖ్యంగా కోహ్లీసేన బలహీన జట్లపై గెలుస్తోందనే వాదన కూడా తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలోనే సంజయ్ మంజ్రేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్ విరాట్ భారత్కు కఠిన సిరీస్లు ఉండేలా చూసుకోవాలని సలహా ఇచ్చాడు. గతంలో ఇమ్రాన్ తన కెప్టెన్సీలో పాక్ ఆడే మ్యాచ్లను బలమైన ప్రత్యర్థులతో ఉండేటట్లు చూడాలని బోర్డును కోరేవాడని అన్నాడు.
'ఇమ్రాన్ ఖాన్ బలమైన పాకిస్థాన్ జట్టును నడిపించే సమయంలో తమకు సవాలు విసిరే జట్లతో సిరీస్లు పెట్టాలని బోర్డును కోరేవాడు. విరాట్ కోహ్లీ కూడా ఇప్పుడదే చేయాలి' అని మంజ్రేకర్ ట్వీట్ చేశాడు. ఐపీఎల్ సందర్భంగా పొలార్డ్ను, ఇటీవల ముగిసిన మహిళల వరల్డ్ కప్ సందర్బంగా భారత క్రికెటర్లపై విమర్శలు చేసి నవ్వులు పాలయ్యాడు.