

హైదరాబాద్: బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో బుధవారం జరిగిన రెండో టీ20లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోవడంతో రెండు టీ20ల సిరిస్ను 0-2తో చేజార్చుకున్న సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీ(72 నాటౌట్) దూకుడుతో టీమిండియాకు భారీ స్కోరు సాధించినప్పటికీ... గ్లెన్ మ్యాక్స్వెల్ (113 నాటౌట్) సెంచరీకి ముందు భారీ లక్ష్యం కూడా చిన్నపోయింది.
ఈ సిరీస్కంటే ముందు న్యూజిలాండ్లోనూ భారత్కు ఓటమి ఎదురైంది. దీంతో ఫ్యాన్స్ నిరాశకు లోనయ్యారు. ఈ మ్యాచ్లో ఐదుగురు బౌలర్లతో బరిలో దిగింది. ఈ ఐదుగురిలోనూ కృనాల్ పాండ్య, విజయ్ శంకర్ ఆల్రౌండర్లు కావడం విశేషం. ఆరో బౌలర్ లేకపోవడం భారత్కు మైనస్గా మారింది. విజయ్ శంకర్ 38 పరుగులు ఇచ్చుకోగా.. పాండ్యా 33 పరుగులు ఇచ్చాడు.
రెండో టీ20 ముగిసిన తర్వాత బౌలర్ల ఎంపిక తీరును మాజీ క్రికెటర్లు ఆకాశ్ చోప్రా, సంజయ్ మంజ్రేకర్ తప్పుబట్టారు. "ఐదుగురు బౌలర్లు మాత్రమే ఆడటం సరైంది కాదని ఆకాశ్ చోప్రా అభిప్రాయపడ్డాడు. చాహల్ కూడా ఎక్కువ పరుగులు ఇచ్చాడు. కానీ మనకు మరో చాయిస్ లేకపోయింది. టీ20ల్లో ఇది వ్యూహాత్మక పొరబాటు. ఇది భారత్కు వరుసగా రెండో టీ20 ఓటమి" అని ఆకాశ్ చోప్రా ట్వీట్ చేశాడు.
జట్టు ఎంపికపై సంజయ్ మంజ్రేకర్ కాస్త ఘాటుగానే విమర్శించారు. "రానున్న ప్రపంచ కప్ను దృష్టిలో ఉంచుకొని జట్టును ఎంపిక చేశారని తెలుసు. కానీ ఇటీవలి ఇదే అత్యంత బలహీనమైన బౌలింగ్ విభాగం. ఐదుగురు బౌలర్లలో కృనాల్, విజయ్ శంకర్లు కూడా ఉన్నారు" అని మంజ్రేకర్ ట్వీట్ చేశారు.