
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ క్రికెటర్, ప్రపంచకప్ల హీరో యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ అనంతరం నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ, ఇతరుల పోస్టులకు స్పందిస్తూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా ప్రస్తుత భారత్ క్రికెట్ జట్టు గురించి ఆసక్తికర కామెంట్లు చేయడంతో పాటు తాను ఎందుకు క్రికెట్ వీడ్కోలు పలికాడనే విషయాన్ని కూడా అభిమానులతో షేర్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే మరో పోస్ట్తో అభిమానుల ముందుకు వచ్చాడు.
క్లీన్ షేవ్తో దిగిన ఒక కొత్త ఫొటోని యువరాజ్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. దీనికి 'కొత్త లుక్.. చిక్నా చమేలా' అని కింద క్యాప్షన్ ఇచ్చాడు. ఇక తన కొత్త లుక్ ఎలా ఉందో అభిమానులను అడిగాడు. మునుపటిలా తన గడ్డాన్ని కలిగి ఉండాలా? అని కూడా యువీ ప్రశ్నించాడు. కొత్తలుక్లో చూసిన అభిమానులు తెగ లైకులు కొడుతున్నారు. అలాగే.. ఈ యువీ గడ్డం పెంచుకోవాలని చాలా మంది కామెంట్లు పెడుతున్నారు.
యువీ కొత్తలుక్ చూసిన భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా కూడా తనదైన శైలిలో కామెంట్ చేశారు. 'నీ గడ్డాన్ని దాచుకునేలా పెదాలను ముందుకు తెచ్చావా. మళ్లీ గడ్డం పెంచూ' అని సరదాగా ట్రోల్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి యువీ నుండి సానియాకు ఏవిధమైన స్పందన వస్తుందో చూడాలి. కొద్ది నెలల క్రితమే యువరాజ్ సింగ్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే.
వీడ్కోలు పలికిన అనంతరం యువీ ప్రస్తుతం తన అభిప్రాయాలు నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో రోహిత్కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని, తద్వారా విరాట్ కోహ్లీపై భారం తగ్గుతుందని అన్నాడు. ఏదైమైనా జట్టు యాజమాన్యమే నిర్ణయం తీసుకోవాలని పేర్కొన్నాడు. మరోవైపు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కు అపారమైన ప్రతిభ ఉంది. ఇప్పుడే ఒత్తిడి పెంచొద్దు. అవకాశాలు ఇవ్వాలి అని సూచించాడు.