హైదరాబాద్: తన భర్త, పాక్ వెటరన్ క్రికెటర్ అయిన షోయబ్ మాలిక్ను అవమానించేలా ట్వీట్ చేసిన ఓ పాక్ జర్నలిస్టుకు సానియా మీర్జా దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. దీంతో అతడు తన ట్వీట్ను డిలీట్ చేశాడు. యూఏఈ వేదికగా శుక్రవారంతో ముగిసిన ఆసియాకప్ టోర్నీలో పాకిస్థాన్ జట్టు తన పేలవ ప్రదర్శనతో విమర్శల పాలైన సంగతి తెలిసిందే.
భారత్ Vs బంగ్లా ఆసియాకప్ ఫైనల్: ఏడోసారి టైటిల్, నమోదైన రికార్డులివే
టోర్నీ ఫైనల్కు చేరాల్సిన కీలక మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. దీంతో పాక్ ఆటతీరుపై క్రికెట్ విశ్లేషకులు సైతం తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో పాకిస్థాన్కు చెందిన సయ్యద్ రాజా మెహ్దీ అనే ఓ జర్నలిస్టు షోయబ్ మాలిక్ను ఉద్దేశించి ఉర్దూలో ట్వీట్ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
''తన ఆటతీరుతో సానియాను ఏమాత్రం ఇంప్రెస్ చేశాడో ఎవరైనా షోయబ్ను అడగండి. కనీసం తర్వాతి టోర్నమెంటులోనైనా దేశం కోసం ఆడతాడేమో తెలుసుకోండి. అయినా, భార్యను సంతోష పరిచేందుకు ఆడే వ్యక్తి నుంచి ఈ దేశం ఇంతకంటే ఇంకేమి ఆశిస్తుంది?'' అంటూ ఎద్దేవా చేశాడు.
Arre bechaara.. clearly the poor guy has been watching a different Asia Cup!! https://t.co/c6JV6IHE8Y
— Sania Mirza (@MirzaSania) September 26, 2018
ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయి చివరికి సానియా మిర్జా దృష్టికి వచ్చింది. ఈ ట్వీట్ చూసిన సానియా కాస్తంత ఘాటుగానే ట్విట్టర్ లో స్పందించింది. ''అరే బేచారా.. అమాయకుడిలా ఉన్నావే. నువ్వో ప్రత్యేకమైన ఆసియా కప్ను చూస్తున్నట్టుంది'' అని ట్వీట్ చేసింది.
Ofcourse he did !! 💆🏽♀️ https://t.co/gHjWXhgm8H
— Sania Mirza (@MirzaSania) September 26, 2018
సానియా ట్వీట్తో దెబ్బకు సదరు జర్నలిస్టు తన ట్వీట్ను డిలీట్ చేయడం విశేషం. అతడు ట్వీట్ను డిలీట్ చేసిన విషయాన్ని ఓ నెటిజన్ ట్విట్టర్ ద్వారా సానియా మిర్జా దృష్టికి తీసుకురాగా... అవును, అతడు ఈ పని చేస్తాడని తెలుసంటూ సానియా ట్వీట్ చేసింది.
ఇదిలా ఉంటే ఈ ఆసియా కప్ టోర్నీలో షోయబ్ మాలిక్ ప్రదర్శన అంత చెత్తగా ఏమీ లేదు. మొత్తం ఐదు మ్యాచ్ లాడిన షోయబ్ మాలిక్ వరుసగా 9, 19, 51, 78, 30 పరుగులతో ఫరవాలేదనిపించాడు.