హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చివరి సెమీ ఫైనల్ బెర్తు కోసం సోమవారం శ్రీలంక-పాకిస్థాన్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్ పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్కు 250వ వన్డే. దీంతో పాక్ తరుపున 250 వన్డేలు ఆడిన బ్యాట్స్మన్గా షోయబ్ మాలిక్ అరుదైన ఘనత సాధించనున్నాడు.
ఈ సందర్భంగా షోయబ్ భార్య, భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జా క్రికెట్ పట్ల అతడి అంకితభావంపై ప్రశంసల జల్లు కురిపించింది. ఈ మ్యాచ్ తామందరికీ ఎంతో గర్వకారణమని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తన ఫేస్ బుక్ పేజిలో పోస్టు చేసిన వీడియోలో పేర్కొంది.
ఛాంపియన్స్ ట్రోఫీ స్పెషల్ ఫోటోలు | స్కోరు కార్డు
'పాకిస్థాన్ పట్ల, క్రికెట్ పట్ల అతనికి ఉన్న అంకితభావాన్ని ఇది చాటుతోంది. క్రికెట్ పట్ల ప్రేమతో దేశానికి ప్రాతినిధ్యం వహించాలన్న తపనతో అతను ఎప్పుడూ ఉంటాడు. అతని తల్లికి, సోదరుడికి, నాకు ఇది ఎంతో గర్వకారణమైన సందర్భం. అతను సాధించిన దానిపట్ల మేం చాలా గర్వంగా ఉన్నాం' అని సానియా పేర్కొంది.

మరోవైపు తామిద్దరం క్రీడాకారులు కావడంతో ఒకరితో ఒకరు కలిసి గడిపేందుకు వీలుగా ప్రయాణాలు ప్లాన్ చేసుకుంటామని సానియా వెల్లడించింది. 'క్రీడాకారులం కావడంతో మేం చాలా సమయం వేరుగా గడుపుతాం. కానీ ఫోన్లు చాలా సాయపడతాయి. ఎంతో సమన్వయంతో ప్లాన్ చేసుకుంటాం. నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నప్పుడే పాక్ జట్టు ఆస్ట్రేలియాకు వచ్చింది' అని సానియా చెప్పింది.
'అలాంటి సమయాల్లో కలుసుకుంటాం. కొన్నిసార్లు మా షెడూళ్లు మ్యాచ్ అవుతాయి. నాకు ఈ వారాంతం కలిసి వచ్చింది. అందుకే దుబాయ్కో, ఇండియాకో వెళ్లకుండా ఇక్కడికి (లండన్) వచ్చాను. దీంతో కొన్ని క్రికెట్ మ్యాచులను వీక్షించే అవకాశం దక్కింది' అని చెప్పింది.
ఫ్రెంచ్ ఓపెన్లో భాగంగా పారిస్లో ఉండటం వల్ల ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లను చూడలేకపోయానని, చివరిసారిగా పాక్-దక్షిణాఫ్రికా మ్యాచ్తోపాటు భారత్ మ్యాచ్లను కొన్నింటిని మాత్రమే చూశానని ఆమె వివరించింది.