
భారత టెన్నిస్ సూపర్ స్టార్ సానియా మీర్జా ఈ క్రీడకు వీడ్కోలు పలికింది. క్రీడా ప్రపంచంలో ఆమె ప్రయాణం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో మొదలైంది. ఈ క్రమంలోనే అక్కడ ఆమె కోసం ప్రత్యేకంగా ఒక ఫేర్వెల్ మ్యాచ్ ఏర్పాటు చేశారు. దీనిలో పాల్గొనేందుకు వచ్చిన సానియా.. మ్యాచ్ అనంతరం ఎమోషనల్ అయిపోయింది. ఆమెకు వీడ్కోలు పలికేందుకు వందలాది మంది అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. తెలంగాణ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, కేటీఆర్ తదితరులు కూడా ఈ మ్యాచ్ను వీక్షించారు. అనంతరం సానియాను సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడిన సానియా.. తన కెరీర్ ఆసాంతం అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. 'ఈ ఇరవై సంవత్సరాలు నా దేశం తరఫున ఆడటం నాకు దక్కిన అతిగొప్ప గౌరవం. ప్రతి అథ్లెట్ కూడా అత్యున్నత స్థాయిలో తన దేశం తరఫున ఆడాలని కోరుకుంటాడు. నేను అది చేయగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది.
నా ఈ ఫేర్వెల్ను సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇంత కన్నా గొప్ప ఫేర్వెల్ ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవడం లేదు. చాలా థ్యాంక్స్' అని చెప్పింది. తన అద్భుతమైన కెరీర్లో ఒలింపిక్స్లో కూడా డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో పతకాలు సాధించిన సానియా దేశ గౌరవాన్ని ఇనుమడింపచేసిన సంగతి తెలిసిందే.

అలాగే తను రిటైర్ అయినా కూడా ఈ ఆటకు దూరంగా ఉండబోనని సానియా చెప్పింది. భారత్లో, తెలంగాణలో ఈ క్రీడకు సేవ చేస్తానని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఈ స్టేడియం నుంచి, దేశం నుంచి మరింత మంది సానియాలు రావాలని ఆశించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కూడా అదే కోరుకున్నారు. దేశానికి మరింత మంది సానియాలు కావాలని, ఈ కలను నిజం చేయడానికి ఆమెకు తెలంగాణ ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.