కొలంబో: శ్రీలంక వెటరన్ ఆటగాడు సనత్ జయసూర్య మళ్లీ మైదానంలో అడుగుపెట్టడం ఖాయమైంది. ఇప్పటికే టెస్టులకు గుడ్ బై చెప్పిన ఈ ఓపెనర్ ఏడాదిన్నర విరామం తర్వాత తిరిగి శ్రీలంక జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ తో జరిగే ఏకైక టి20, ఐదు వన్డేల సిరీస్ కు ఉపుల్ తరంగ స్థానంలో లంక సెలక్టర్లు జయసూర్యను తీసుకున్నారు. అనంతరం స్కాట్లాండ్ తో జరిగే రెండు వన్డేల్లో కూడా జయసూర్య ఆడనున్నాడు. ఇతడికి జతగా 23 ఏళ్ల ఓపెనర్ దిముత్ కరుణరత్నే తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు.మిడిలార్డర్ బ్యాట్స్ మన్ కందంబిని వైస్ కెప్టెన్ గా నియమించారు. 2009లో భారత్ పై చివరి వన్డే ఆడిన జయసూర్య ఇటీవలి ప్రపంచకప్ కోసం జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. అలాగే ఐపీఎల్ ఆటగాళ్ల వేలంలోనూ 41 ఏళ్ల ఈ డాషింగ్ ఆటగాడిని ఏ ఫ్రాంచైజీ కూడా కొనుగోలు చేయలేదు. ప్రపంచకప్ సందర్భంగా తరంగ డోప్ టెస్టులో విఫలం కావడంతో మరో ఓపెనర్ దొరక్క జయసూర్యను ఎంపికచేయాల్సివచ్చింది. ప్రస్తుత క్రికెటర్లలో అత్యధిక వయస్కుడు ఇతడే. ఇప్పటికి 444 వన్డేలు ఆడిన జయసూర్య 13,428 పరుగులు సాధించాడు. ఈనెల 25న ఇంగ్లండ్ తో టి20 మ్యాచ్ జరుగనుండగా.. 28 నుంచి వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. జూలై 11, 13న స్కాట్లాండ్ తో రెండు వన్డేలు జరుగుతాయి. అంతర్జాతీయ క్రికెట్ లో మరింతకాలం కొనసాగదలుచుకోలేదని జయసూర్య అన్నాడు. ఈ పర్యటనలో ఓ టి20, వన్డే మ్యాచ్ ఆడే అవకాశముందన్నాడు. జయసూర్య వ్యాఖ్యలను బట్టి చూస్తే... ఈ క్రికెట్ యోధుడికి ఘనమైన వీడ్కోలు పలికేందుకే సెలక్టర్లు తిరిగి జట్టులోకి తెచ్చారని తెలుస్తోంది.జట్టు:దిల్షాన్ (కెప్టెన్), కందంబి, జయసూర్య, కరుణరత్నే, సంగక్కర, జయవర్ధనే, మాథ్యూస్, చండిమాల్, తిరిమన్నే, జీవన్ మెండిస్, పెరీరా, కులశేఖర, రణదీవ్, మలింగ, ఫెర్నాండో, లక్మల్. #13;