ఒకప్పుడు శ్రీలంక జట్టు అంటే ప్రత్యర్థులు భయపడేవారు. ఆటపట్టు, సనత్ జయసూర్య, లసిత్ మలింగ, జయవర్ధనే, సంగర్కర వంటి ఆటగాళ్లతో శ్రీలంక టీం పట్టిష్టంగా కనిపించేది. భారత్ జట్టుతో ఢీ అంటే ఢీ అనే విధంగా ఆడేది. 2011లో జరిగిన వరల్డ్ కప్లో ఫైనల్కు చేరిన ఆ జట్టు ఇండియా చేతిలో ఓడిపోయింది. ఆ తర్వాత శ్రీలంక ప్రధాన ఆటగాళ్లందరూ ఒకరి తర్వాత ఒకరు రిటైర్ ఇవ్వడంతో శ్రీలంక క్రికెట్ కోలుకోలేకపోయింది. క్రమేపి ఆ జట్టు బలహీనంగా తయ్యారైంది. బలహీనమైన జట్లతో పోటిపడే స్థితికి శ్రీలంక జట్టు చేరుకుంది. ఈక్రమంలోనే టీమిండియా శ్రీలంకలో పర్యటించింది.
మొదట ఈ సిరీస్పై ఎవరూ కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు. శ్రీలంక మీద ఇండియా ఎలాగో గెలుస్తుందని అంతా భావించారు. దీనికి తగ్గట్టుగానే టీ20లను టీమిండియా వైట్వాష్ చేసింది. అయితే వన్డేలకు వచ్చే సరికి సీన్ రివర్స్ అయింది. రెండు వరుస వన్డేలను గెలిచిన శ్రీలంక సిరీస్ను ఎగరేసుకుపోయింది. ఫలితంగా 27 సంవత్సరాల తర్వాత టీమిండియాపై శ్రీలంక జట్టు సిరీస్ గెలిచి చరిత్ర సృష్టించింది. దీని వెనుక ఆ జట్టు కోచ్ సనత్ జయసూర్య కష్టం ఉందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.

వరుస పరాజయాలు జట్టును పలకరించడంతో, పట్టుబట్టి మరీ సనత్ జయసూర్యను జట్టు కోచ్గా శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది. సనత్ జయసూర్య ఇచ్చిన సూచనల వల్లే టీమిండియాపై శ్రీలంక విజయం సాధించగలిగింది. లంక ఆటగాళ్లలో ధైర్యం నూరిపోయడంలో జయసూర్య పాత్ర వెల కట్టలేనిది. భారత్పై గెలవగలమనే భరోసాను ఇచ్చి టీంను ముందుకు నడిపించాడు. ఇది వర్కౌట్ అయింది. భారత్పై శ్రీలంక ఘన విజయం సాధించింది. సిరీస్ విజయం సాధించడంతో ఆటగాళ్లు ఆనందంలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ సమయంలోనే జయసూర్య జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు.
జయసూర్య టీమ్ను వీడేందుకు సిద్ధమయ్యాడు.లంక తాత్కాలిక కోచ్గా ఉన్న జయసూర్య తన బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు. త్వరలో జరగబోయే ఇంగ్లండ్తో జరిగే సిరీస్ తర్వాత అతడు కోచింగ్ నుంచి తప్పుకొని లంక క్రికెట్ బోర్డు వ్యవహారాల్లో బిజీ కానున్నాడు. లంక క్రికెట్ బోర్డు కోరిక మేరకు జయసూర్య తాత్కాలిక కోచ్గా బాధ్యతలను చేపట్టడం జరిగింది. రెగ్యులర్ కోచ్ లేకపోవడంతో రెండు సిరీస్ల కోసం ఆ రోల్లోకి వచ్చిన జయసూర్య.. ఇంకొన్ని రోజుల్లో దిగిపోనున్నాడు.
ఈ విషయాన్ని స్వయంగా జయసూర్యే తెలిపాడు. దీనిపై జయసూర్య మాట్లాడుతూ..తమ జట్టుకు ఓ మంచి పర్మినెంట్ కోచ్ రావాలని, జట్టును విజయాలబాటలో నడిపే వ్యక్తి రాక కోసం ఎదురు చూస్తున్నామని తెలిపారు. భారత్ లాంటి టాప్ టీమ్పై సిరీస్ నెగ్గడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని.. తమ జట్టు ఎంతో బాగా ఆడిందని ఆటగాళ్లను మెచ్చుకున్నాడు. అయితే భారత్ లాంటి జట్టుపై విజయం సాధించడంతో జయసూర్యను కోచ్గా కొనసాగించాలని లంక ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.