Women World Cup 2025: ఆసియా కప్ సమయంలో పాకిస్తాన్ క్రికెటర్లు భారత్ను రెచ్చగొట్టేలా వ్యవహరించిన తీరుపై పెద్ద దుమారం రేగిన విషయం తెలిసిందే. ఆసియా కప్ లో మూడు సార్లు ఓడించినా ఇంకా ఆ బుద్ధి మారడం లేదు. తాజాగా ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025 టోర్నీలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సనా మీర్ చేసిన వ్యాఖ్యలు మరోసారి క్రీడా రాజకీయాల చర్చను తెరపైకి తెచ్చాయి. మ్యాచ్ మధ్యలో ఆమె కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారతీయ నెటిజన్లు, అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కొలంబో మ్యాచ్లో అసలేం జరిగింది?
ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 2న కొలంబో వేదికగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ (PAK vs BAN) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సనా మీర్ కామెంటేటర్గా వ్యవహరించింది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ ఓపెనర్ నటాలియా పర్వేజ్ బ్యాటింగ్కు వస్తున్న సమయంలో, సనా మీర్ ఆమె స్వస్థలం గురించి ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్య చేసింది."నటాలియా ఆజాద్ కశ్మీర్ (పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను ఉద్దేశిస్తూ)కు చెందిన అమ్మాయి. లాహోర్కు వచ్చి క్రికెట్లో రాణిస్తోంది." ఓ అంతర్జాతీయ క్రీడా వేదికపై కామెంటరీ సందర్భంగా ఉద్దేశపూర్వకంగా 'ఆజాద్ కశ్మీర్' అనే పదాన్ని వాడటం తీవ్ర చర్చకు దారితీసింది. నటాలియా పర్వేజ్ స్వస్థలం భీంబర్ జిల్లా. ఇది పీవోకేలో ఉంది. ఈ ప్రాంతాన్ని 'ఆజాద్ కశ్మీర్'గా సనా మీర్ పేర్కొనడంపై భారత నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

నెట్టింట విమర్శల దాడి
పాక్ మాజీ కెప్టెన్ సనా మీర్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో త్వరగా నెట్టింట వైరల్ కావడంతో ఆమెపై విమర్శల దాడి మొదలైంది. భారతీయ నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, "ఆజాద్ కశ్మీర్ అని మాట్లాడే ఇలాంటి ఆటగాళ్లా... రాజకీయాలను క్రీడలకు దూరంగా ఉంచాలని మనకు నీతులు చెప్పేది?" అంటూ దుమ్మెత్తి పోశారు. క్రికెట్ వంటి క్రీడలను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని చెబుతూనే, పాకిస్థాన్ తరఫున ఆడబోతున్నప్పుడు లేని రాజకీయ అంశాలను తీసుకురావడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
సనా మీర్ వివరణ
విమర్శలు అధికం కావడంతో సనా మీర్ సోషల్ మీడియా ద్వారా తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చుకుంది. రాజకీయ ఉద్దేశంతో తాను ఆ వ్యాఖ్య చేయలేదని, కేవలం నటాలియా పడిన కష్టాలను, ఆమె ప్రయాణాన్ని హైలైట్ చేసే క్రమంలోనే ఆ పదాన్ని వాడానని ఆమె పేర్కొందిసనా మీర్ వివరిస్తూ.. "నటాలియా స్వస్థలం నుండి వచ్చి క్రికెట్ ఆడటానికి పడిన కష్టాన్ని మాత్రమే చూపించాలనుకున్నాను. క్రీడాకారులు తమ కెరీర్లో అధిగమించిన సవాళ్లను వివరించడం కామెంటరీలో భాగం.తన మాటల వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని, ఈ అంశాన్ని రాజకీయాలు చేయొద్దు" అని ఆమె అభ్యర్థించింది. అయితే సనా మీర్ తన వ్యాఖ్యలపై క్షమాపణసు మాత్రం చెప్పకపోవడం గమనార్హం. సనా మీర్ కేవలం వివరణతో సరిపెట్టే ప్రయత్నం చేసింది.
తర్వాత మ్యాచ్పై ప్రభావం
ఈ వివాదం మరింత ముదరడానికి, అక్టోబరు 5న భారత మహిళా జట్టుతో పాకిస్థాన్ తలపడనున్న కీలక మ్యాచ్ ఒక కారణంగా మారింది. ఒకవైపు తొలి మ్యాచ్లో బంగ్లాదేశ్ చేతిలో ఘోర పరాజయం (పాకిస్థాన్ 129 పరుగులకే ఆలౌట్ అయింది) పాలైన పాకిస్థాన్ జట్టు ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. ఇప్పుడు కామెంటరీ వివాదం, ముఖ్యంగా భారత్తో మ్యాచ్కు ముందు రావడంతో, క్రికెట్పై రాజకీయాల ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.