హైదరాబాద్: రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్స్లో గుజరాత్ ఆటగాడు సమిత్ గోయల్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో భాగంగా రాజస్ధాన్లోని సవాయి మాన్ సింగ్ స్టేడియంలో ఒడిషాతో జరుగుతున్న మ్యాచ్లో ఓపెనింగ్ బ్యాట్స్ మెన్గా బరిలోకి దిగిన సమిత్ గోయల్ 359 పరుగులు చేశాడు.
723 బంతులాడిన గోయల్ 45 ఫోర్లు, ఒక సిక్సుతో ఈ ఘనతను సాధించాడు. తద్వారా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓపెనింగ్ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా సమిత్ గోయల్ చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో 117 ఏళ్ల నాటి రికార్డుని బద్దలు కొట్టాడు.

అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఓపెనర్గా వచ్చి 359 పరుగులు చేసిన మొట్టమొదటి క్రికెటర్గా వరల్డ్ రికార్డుని నెలకొల్పాడు. ఈ వరల్డ్ రికార్డుని నెలకొల్పే క్రమంలో 1889లో సరైస్ బాబీ పేరిట ఉన్న 357 పరుగుల రికార్డుని గోయల్ అధిగమించాడు.
రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన నాలుగో బ్యాట్స్ మెన్గా సమిత్ గోయల్ అవతరించాడని ప్రముఖ క్రికెట్ నిపుణుడు మోహన్ దాన్ మీనన్ తన ట్విట్టర్లో పేర్కొన్నాడు. తొలి ఇన్నింగ్స్లో 4 పరుగులకే పెవిలియన్కు చేరుకున్న గోయల్, రెండో ఇన్నింగ్స్లో తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు.
గోయల్ మూడు రోజులు క్రీజులో ఉన్నాడు. ఆటలో భాగంగా మూడో రోజైన ఆదివారం 110 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇక నాలుగో రోజైన సోమవారం (డిసెంబర్ 26) ఆట ముగిసే సమయానికి 261 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇక చివరిరోజైన మంగళవారం గోయల్ ఈ అరుదైన ఘనతను సాధించాడు.
ఈ మ్యాచ్కి ముందు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో గోయల్ అత్యధిక స్కోరు 104. ఇప్పటివరకు 27 మ్యాచ్లాడిన గోయల్ రెండు సెంచరీలు నమోదు చేశాడు. గోయల్ విజృంభణతో గుజరాత్ రెండో ఇన్నింగ్స్లో 227.4 ఓవర్లకు గాను 641 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో 64 పరుగుల ఆధిక్యంలో నిలిచిన గుజరాత్ జట్టు సెమీస్కు అర్హత సాధించింది.