హైదరాబాద్: భారత-ఏ జట్టుతో మంగళవారం ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మూడు వికెట్ల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 305 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లండ్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి మరో ఏడు బంతులు మిగిలుండగానే ఛేదించింది.
ఓటమితో ధోని వీడ్కోలు: రాయుడు సెంచరీ వృథా
305 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టులో స్యామ్ బిల్లింగ్స్ 85 బంతుల్లో 8 ఫోర్లతో 93 పరుగులు చేసిన తృటిలో సెంచరీని చేజార్చుకున్నా జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన బిల్లింగ్స్ తన ఆటతీరుకు తమ మెంటర్ ద్రవిడ్ కారణమని చెప్పాడు.
గతేడాడి ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మెంటార్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ స్పిన్ బౌలింగ్ ఎదుర్కొవడంలో తన బ్యాటింగ్ టెక్నిక్స్ను మెరుగు పరిచాడని తెలిపాడు. 'బ్యాటింగ్లో ముఖ్యంగా ఫుట్వర్క్ సమస్యను అధిగమించాను. గతంలో స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సమస్యలుండేవి. అయితే ద్రవిడ్ కోచింగ్తో ఈ సమస్యను కేవలం ఆరువారాల్లో అధిగమించాను' అని తెలిపాడు.
స్పిన్ ఆడటం కష్టమని చెప్పిన బిల్లింగ్స్ అశ్విన్, జడేజాలు ప్రపంచంలోనే అత్యుత్తమ స్పిన్నర్లని కితాబిచ్చాడు. తన కెరీర్లో కెప్టెన్గా చివరి మ్యాచ్ ఆడిన ధోనిపై కూడా బిల్లింగ్స్ ప్రశంసలు కురిపించాడు. ధోనీకి ఇండియాతో పాటు ప్రపంచమంతటా అభిమానులు ఉన్నారని అన్నాడు.
ఇటీవలే పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతల నుంచి మహేంద్ర సింగ్ ధోని తప్పుకున్న నేపథ్యంలో అతడి స్ధానంలో సెలక్టర్లు కోహ్లీని ఎంపిక చేశారు. జనవరి 15 నుంచి ఇంగ్లాండ్తో జరగనున్న మూడు వన్డేలు, టీ20ల మ్యాచ్ సిరిస్కు కోహ్లీనే సారథ్య బాధ్యతలను చేపట్టనున్నాడు.
తప్పక చూడండి: ధోనిని ఇంటర్యూ చేసిన యువీ (వీడియో)
కాగా, ఇంగ్లాండ్తో బుధవారం జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో ధోని, యువరాజ్ సింగ్లు అంచనాలకు మించి రాణించారు. స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్కు వచ్చిన ధోని తనదైన స్టైల్లో రెచ్చిపోయి ఆడాడు. అభిమానుల అంచనాలను ఏమాత్రం వమ్ముచేయకుండా కేవలం 40 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 68 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు.
ఇక యువరాజ్ 48 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 56 ఫరుగులు చేశాడు. బౌలింగ్లో కుల్దీప్ యాదవ్ (5/60) మినహా మిగతా బౌలర్లు నిరాశపర్చడంతో భారీస్కోరును కూడా టీమిండియా కాపాడుకోలేకపోయింది.