వాంఖడే వేదికగా విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో ముంబై ఆధిపత్యం చెలాయిస్తోంది. విదర్భకు కొండంత లక్ష్యాన్ని నిర్దేశిస్తోంది. ప్రస్తుతం మూడో రోజు ఆటలో లంచ్ విరామానికి 85 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. మొత్తంగా 381 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. శ్రేయస్ అయ్యర్ (68*; 75 బంతుల్లో), ముషీర్ ఖాన్ (86*; 237 బంతుల్లో) క్రీజులో ఉన్నారు.
ఓవర్నైట్ స్కోరు 141/2తో ఇవాళ ఆటను ప్రారంభించిన కొద్దిసేపటికే ముంబై వికెట్ కోల్పోయింది. అజింక్య రహానె (73; 143 బంతుల్లో)ను హర్ష్ దూబె పెవిలియన్కు చేర్చాడు. అయితే అంపైర్ ఔట్ అని ప్రకటించకముందే రహానె మైదానాన్ని వీడాడు. హర్ష్ దూబె వేసిన జప్ఫా కాస్త ఎక్సట్రా బౌన్స్ అయింది. ఫార్వర్డ్ డిఫెన్స్కు ప్రయత్నించిన రహానె బంతిని అంచనా వేయడంలో విఫలమయ్యాడు. బ్యాటకు ఎడ్జ్ తీసుకుని వికెట్ కీపర్ అక్షయ్ చేతికి చిక్కాడు.

అయితే అంపైర్ నిర్ణయాన్ని ప్రకటించే వరకు రహానె ఎదురుచూడలేదు. ఔటయ్యానని నిర్ధారించుకున్న రహానె క్రీడాస్ఫూర్తితో స్వతహాగా మైదానాన్ని వీడాడు. రహానె చూపించిన ఈ క్రీడాస్ఫూర్తికి నెటిజన్లు సెల్యూట్ చేస్తూ కొనియాడుతున్నారు. కాగా, రహానె ఔటవ్వడంతో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సాధికారికంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్లో ఏడు పరుగులకే ఔటైన శ్రేయస్ ఈ సారి పట్టుదలతో బ్యాటింగ్ చేస్తున్నాడు.
ఎనిమిది బౌండరీలు, రెండు సిక్సర్లు సాధించాడు. 62 బంతుల్లోనే అర్ధశతకం సాధించాడు. అతనికి తోడుగా ముషీర్ ఖాన్ కూడా సంయమనంతో ఆడుతున్నాడు. సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. రెండో సెషన్లో వీరిద్దరు దూకుడుగా ఆడే అవకాశం ఉంది. సెంచరీలు చేరుకున్న అనంతరం ముంబై రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్లో ముంబై 224 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే. అనంతరం బ్యాటింగ్కు వచ్చిన విదర్భ మొదటి ఇన్నింగ్స్లో 105 పరగులకే కుప్పకూలింది.