
హైదరాబాద్: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీరాభిమాని. సల్మాన్ ఖాన్ ఇంట్లో జరిగే వేడుకలకు కూడా ధోనీ హాజరవుతుంటాడు. ఇదే క్రమంలో.. గతేడాది సల్మాన్ఖాన్ పుట్టిన రోజు వేడుకల్లో ధోనీ పాల్గొన్నాడు. ఈ తర్వాత కోహ్లీ-అనుష్కలు ముంబైలో ఇచ్చిన వివాహ విందులో పాల్గొన్న ధోనీ ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ఇంటికి కూడా వెళ్లాడు.
అంతేకాదు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన 'సుల్తాన్' సినిమా ప్రత్యేక స్క్రీనింగ్కి ధోనీ తన భార్య సాక్షితో కలిసి హాజరయ్యాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి.
సల్మాన్ ప్రస్తుతం 'దస్ కా దమ్' కార్యక్రమంలో బిజీగా గడుపుతున్నాడు. ఇటీవల ఓ ఎపిసోడ్లో సల్మాన్ 'భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన వారిలో మీకు ఎవరంటే ఇష్టం?' అని అడిగాడు. ప్రశ్నతో పాటుగా కపిల్ దేవ్, సౌరివ్ గంగూలీ, విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ అంటూ నాలుగు ఆప్షన్లు ఇచ్చాడు. ఆ తర్వాత సల్మాన్ తనకు ఎందుకు ధోనీ అంటే ఇష్టమో చెప్పాడు.
'నాకు మాత్రమే కాదు మా నాన్నకు కూడా ధోనీ అంటే చాలా ఇష్టం. భారత క్రికెట్ జట్టుకు ధోనీ బెస్ట్ కెప్టెన్ అవుతాడని మా నాన్న అప్పట్లో అంటుండేవారు. ధోనీ ఎప్పుడూ ఎంతో కూల్గా, పాజిటివ్ ఎనర్జీతో కనిపిస్తాడు. అంతేకాదు జట్టు విజయం సాధించినప్పుడు, సెంచరీ కొట్టినప్పుడు ఎలాంటి సంబరాలు చేసుకోడు. ఎంతో ప్రశాంతంగా కనిపిస్తాడు. మైదానంలో ఎంతో మర్యాదగా ఉంటాడు. ఇవన్నీ చూసే నేను, మా నాన్న ధోనీకి అభిమానులమైపోయాం' అని సల్మాన్ ఖాన్ తెలిపాడు.
ప్రస్తుతం క్రికెట్ నుంచి కాస్త విరామం దొరకడంతో ధోనీ కుటుంబసభ్యులతో గడుపుతున్నాడు. ఈ నెలాఖరులో ఐర్లాండ్తో జరిగే టీ20 సిరీస్లో ధోనీ ఆడనున్నాడు.