
అశ్విన్ను పక్కనపెట్టి మరీ
పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో భారత బ్యాట్స్మెన్ వైఫల్యం ఘోరమే అయినా కెప్టెన్ విరాట్ కోహ్లీ (57; 49 బంతుల్లో 5x4, 1x6), వికెట్ కీపర్ రిషబ్ పంత్ (39; 30 బంతుల్లో 2x4, 2x6) ఆదుకోవడంలో భారత్ పోరాడగలిగే స్కోరు చేసింది. కానీ భారత బౌలర్లు మాత్రం అత్యంత దారుణంగా విఫలమయ్యారు. ఎన్నడూ లేనంతగా చెత్త ప్రదర్శన చేస్తూ.. కనీసం ఒక్క వికెట్ కూడా పడగొట్టలేకపోయారు. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ను పక్కనపెట్టి మరీ జట్టులోకి తీసుకున్న మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తీవ్రంగా నిరాశపరిచాడు.
ఐపీఎల్ 2021లో భాగంగా 10 రోజుల క్రితం అదే యూఏఈలో అదరగొట్టిన వరుణ్.. అసలు మెగా సమరంలో మాత్రం తేలిపోయాడు. ఇదే విషయాన్ని పాక్ మాజీ ఓపెనర్ సల్మాన్ బట్ ఎత్తిచూపాడు. ఇలాంటి మిస్టరీ స్పిన్ను పాక్ ఆటగాళ్లు గల్లీ క్రికెట్లోనే నేర్చుకుంటారని, చిన్నతనం నుంచి ఇలాంటి బంతులు ఎదుర్కోవడం వారికి అలవాటేనని చెప్పాడు.

వీధి క్రికెట్లోనే ఆడారు
పాకిస్థాన్లోని ప్రతి పిల్లాడు వీధి క్రికెట్లోనే మిస్టరీ స్పిన్ను ఎదుర్కొంటారని, వరుణ్ చక్రవర్తి లాంటి బౌలర్లు పాక్ ఆటగాళ్లకు పెద్ద లెక్కకాదని సల్మాన్ బట్ పేర్కొన్నాడు. బట్ తన యూట్యూబ్ ఛానెల్లో మాట్లాడుతూ... 'వరుణ్ చక్రవర్తి మిస్టరీ బౌలర్ కావచ్చు కానీ అతడి బౌలింగ్ మాకు ఏమాత్రం ఆశ్చర్యం కలిగించలేదు. పాకిస్థాన్లో పిల్లలు టేప్ బాల్ క్రికెట్ ఎక్కువగా ఆడతారు. పిల్లలు తమ వేళ్లతో ట్రిక్స్ చేస్తూ బ్యాట్స్మెన్ను తికమక పెట్టడానికి ప్రయత్నించడం ఇక్కడ సర్వసాధారణం. ఇక్కడ వీధి క్రికెట్లోనే విభిన్న వైవిధ్యాలను ప్రయత్నిస్తారు. అందుకే ఆదివారం జరిగిన పోరులో చక్రవర్తిని పాక్ ఓపెనర్లు సునాయాసంగా ఎదుర్కొన్నారు' అని అన్నాడు.

మెండిస్ కూడా ప్రభావం చూపలేకపోయాడు
ఐపీఎల్ 2021లో తన మిస్టరీ స్పిన్తో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున అద్భుతంగా రాణించిన వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్లో ఏమాత్రం ప్రభావం చూపలేదు. ఈ విషయాన్నే చెప్పిన సల్మాన్ బట్.. క్రికెట్ ప్రపంచానికి మిస్టరీ స్పిన్ను పరిచయం చేసిన శ్రీలంక స్పిన్నర్ అజంతా మెండిస్ కూడా పాక్పై పెద్దగా ప్రభావం చూపలేదన్నాడు. 'ప్రపంచంలో ఎన్నో జట్లను తన మిస్టరీ బౌలింగ్తో ఇబ్బంది పెట్టిన అజంతా మెండిస్.. పాక్పై మాత్రం ప్రభావం చూపలేదు.
అతని రికార్డు చూస్తే ఈ విషయం తెలిసిపోతుంది. అందుకే లంక అతన్ని పాక్పై పెద్దగా ఆడించలేదు. ఆ తర్వాత ఇండియాపై కూడా పెద్దగా ఆడించలేదు. మిస్టరీ స్పిన్ ఎవర్ని ఇబ్బంది పెట్టినా పాకిస్థాన్ ఆటగాళ్లకు అది సమస్యే కాదు. ఎందుకంటే వాళ్లు అలాంటి బంతులు ఆడుతూనే పెరుగుతారు' అని మాజీ కెప్టెన్ బట్ పేర్కొన్నాడు.

సునాయాసంగా అంచనా వేసేస్తారు
వరుణ్ చక్రవర్తి వంటి వారిని చూడగానే బంతి ఎటువైపు వెళ్తుందో పాక్ బ్యాట్స్మెన్ సునాయాసంగా అంచనా వేసేస్తారని పాక్ మాజీ ఓపెనర్ సల్మాన్ బట్ పేర్కొన్నాడు. పాక్పై మెండిస్ రికార్డు గురించి టీమిండియా విశ్లేషకుడికి ఈ విషయం తెలియదేమో అని ఎద్దేవా చేశాడు. భారత్ను తక్కువ స్కోరుకే కట్టడి చేసిన పాకిస్థాన్.. బ్యాటింగ్లోనూ అదే జోరు కొనసాగించింది. సొంతగడ్డలాంటి దుబాయ్ పిచ్పై పాక్ ఓపెనర్లు తొలి ఓవర్ నుంచే వేగంగా ఆడారు. మొహ్మద్ రిజ్వాన్ (79; 55 బంతుల్లో 6x4, 3x6), బాబర్ అజామ్ (68; 52 బంతుల్లో 6x4, 2x6) లు హాఫ్ సెంచరీలతో తమ జట్టుకు సునాయాస విజయాన్ని అందించారు.


Click it and Unblock the Notifications












