IND vs PAK: ఆసియా కప్ 2025లో భాగంగా భారత క్రికెట్ జట్టు హై-వోల్టేజ్ మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడుతోంది. ఈ మ్యాచ్లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఈ నిర్ణయం వారికి ప్రతికూలంగా మారింది. పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ ముందు 128 పరుగులు లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ మ్యాచ్లో పాకిస్థాన్ జట్టు మొదటి ఓవర్ నుంచే దారుణమైన పరిస్థితికి వెళ్లిపోయింది. హార్దిక్ పాండ్యా మొదటి ఓవర్లోనే సయీమ్ ఆయుబ్ ను సున్న పరుగుల వద్ద ఓట్ చేయగా.. ఆ తర్వాత ఓవర్లో జస్ప్రీత్ బుమ్రా మహ్మద్ హారిస్ను పెవిలియన్కు పంపించారు. ఈ దెబ్బతో పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ మొత్తం కోలుకోలేకపోయింది. కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కూడా రాణించలేకపోయాడు.
సల్మాన్ అలీ ఆఘా పేలవ ఇన్నింగ్స్
పాకిస్థాన్ జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా నుంచి ఓ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ను ఆశించారు. అయితే సల్మాన్ ఆఘా ఆట తీరు తీవ్ర నిరాశ కలిగించింది. ఒక దశలో సున్నా పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయినట్లు అంపైర్ ప్రకటించినా.. రివ్యూ తీసుకుని బతికిపోయాడు. కానీ సల్మాన్ పేలవమైన ఫామ్ కొనసాగింది. 12 బంతులు ఆడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి టెస్ట్ మ్యాచ్ను తలపించే స్లోగా ఇన్నింగ్స్ ఆడాడు. చివరకు అక్షర్ పటేల్ బౌలింగ్లో స్వీప్ షాట్ ఆడగా.. అభిషేక్ శర్మ పట్టిన అద్భుతమైన క్యాచ్తో పాక్ కెప్టెన్ ఇన్నింగ్స్ ముగిసింది.

ఆసియా కప్ టోర్నమెంట్ లో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా దారుణంగా ఆడుతున్నాడు. ఆయన ఒమన్ తో జరిగిన మొదటి మ్యాచ్లో సున్నా పరుగులకు ఔట్ అయ్యాడు. కెప్టెన్గా జట్టుకు మార్గనిర్దేశం చేయాల్సిన సల్మాన్ అలీ ఆఘా.. వ్యక్తిగతంగానూ, జట్టుకు కూడా బరువుగా మారారని విమర్శలు వస్తున్నాయి. పాకిస్థాన్ పతనానికి ఆయన పేలవమైన బ్యాటింగ్,బాధ్యరాహిత్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది.