IND vs ENG: క్రికెట్ అభిమానులను ఇండియా, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ ఉర్రూతలూగిస్తోంది. ఈ టెస్ట్ సిరీస్ను ఇరుజట్ల మధ్య గట్టి పోటి నెలకొంది. ఇదిలా ఉండగా.. చివరి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం, ఘర్షణలతో ఓవల్ మైదానం దద్దరిల్లింది. ముఖ్యంగా భారత యువ బ్యాటర్ సాయి సుదర్శన్, ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ మధ్య జరిగిన వాగ్వాదం అందరి దృష్టిని ఆకర్షించింది.
ఓవల్ మైదానంలో జరుగుతున్న ఈ కీలకమైన టెస్ట్ మ్యాచ్లో రెండో రోజు ఆట ముగిసే సమయంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారత ఇన్నింగ్స్ జరుగుతుండగా.. యువ లెఫ్ట్ హ్యాండర్ సాయి సుదర్శన్ క్రీజులో ఉన్నాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ వేసిన ఒక బంతికి సాయి సుదర్శన్ ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యాడు. ఫీల్డ్ అంపైర్ వేలు పైకెత్తిన వెంటనే సాయి సుదర్శన్ తన సహచర ఓపెనర్ యశస్వి జైస్వాల్తో చర్చించి ఔట్పై డీఆర్ఎస్ను కోరాడు.

కానీ దురదృష్టవశాత్తూ రివ్యూలో బంతి నేరుగా స్టంప్స్ను తాకుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో, కేవలం 11 పరుగులకే సుదర్శన్ నిరాశగా పెవిలియన్ బాట పట్టాల్సి వచ్చింది. క్రీజు నుంచి నిష్క్రమిస్తున్న సాయి సుదర్శన్ను చూసి, ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ ఏదో వ్యాఖ్యానించాడు. డకెట్ మాటలు సాయి సుదర్శన్ను తీవ్రంగా రెచ్చగొట్టాయి. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన సాయి సుదర్శన్, సగం మార్గంలోనే వెనక్కి తిరిగి వచ్చి డకెట్తో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. వారిద్దరి మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పరిస్థితి అదుపు తప్పుతుందని గ్రహించిన ఇంగ్లండ్ ఆటగాళ్లు, ముఖ్యంగా హ్యారీ బ్రూక్, తాత్కాలిక కెప్టెన్ ఓలీ పోప్ వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీశారు. ఈ సంఘటన మైదానంలో అప్పటికే ఉన్న ఉద్రిక్త వాతావరణాన్ని మరింత పెంచింది. సాధారణంగా ప్రశాంతంగా కనిపించే సాయి సుదర్శన్ ఇంత తీవ్రంగా స్పందించడం క్రికెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
సిరీస్ పొడవునా కొనసాగుతున్న ఉద్రిక్తత
ఈ సిరీస్ పొడవునా ఇండియా, ఇంగ్లాండ్ ఆటగాళ్ల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధాలు, చిన్నపాటి ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఐదో టెస్ట్ మ్యాచ్లో కూడా రెండో రోజు ఈ సాయి సుదర్శన్ - బెన్ డకెట్ సంఘటన మాత్రమే కాదు. అంతకుముందు, ఇంగ్లాండ్ వెటరన్ బ్యాటర్ జో రూట్, భారత ఫాస్ట్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ మధ్య కూడా స్వల్ప వాగ్వాదం జరిగింది. అలాగే భారత యువ పేసర్ ఆకాష్ దీప్, బెన్ డకెట్ వికెట్ను పడగొట్టిన తర్వాత, అతని వీపుపై చేయి వేసి పెవిలియన్కు పంపించడం కూడా వివాదానికి దారి తీసింది. ఈ సంఘటనలన్నీ ఆటలో మరింత వేడిని పెంచాయి.
ఉత్కంఠగా మారిన పోరు
మ్యాచ్ విషయానికి వస్తే, రెండో రోజు ఆట ముగిసే సమయానికి, భారత జట్టు తమ రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసి, ఇంగ్లాండ్పై 52 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అద్భుతమైన ఫామ్ను కనబరిచి, కేవలం 44 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేసుకుని 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. నైట్వాచ్మన్గా బరిలోకి దిగిన ఆకాష్ దీప్ 4 పరుగులతో అతనికి తోడుగా ఉన్నాడు. అంతకుముందు భారత పేసర్లు మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేసి, చెరో 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. ఇంగ్లాండ్ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 247 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అంతకుముందు,భారత జట్టు తమ మొదటి ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.