India Squad For England Test Series: ఐపీఎల్ 2025 పూర్తైన తర్వాత టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో 5 టెస్ట్ మ్యాచ్లు ఆడనుంది. అయితే ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలిసింది. అయితే రోహిత్ శర్మ టెస్ట్ భవిష్యత్ పై పలు ఊహాగానాలు వినిపించాయి. కానీ అతడికి ఇంగ్లాండ్ టెస్ట్ టూర్ కు సంబంధించి షార్ట్ లిస్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కింది. అతడే కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
అయితే ఈ టెస్ట్ సిరీస్ తో సెంచరీ హీరో కరుణ్ నాయర్ కమ్ బ్యాక్ ఇస్తాడని సమాచారం అందింది. సెలెక్ట్ చేసిన ఆటగాళ్ల జాబితాలో కురణ్ నాయర్ కు చోటు దక్కినట్లు తెలిసింది. అలాగే ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ను కూడా ఎంచుకున్నారట. ఈ ఇద్దరిని భారత ఏ జట్టు కోసం ఎంపిక చేశారు. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో అత్యధిక పరుగుల జాబితాలో టాప్ లో కొనసాగుతున్న గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ను బ్యాకప్ గా తీసుకున్నారు. సీఎస్కే యంగ్ ప్లేయర్ ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. కుల్దీప్ యాదవ్ కమ్ బ్యాక్ ఇవ్వనున్నాడు. అక్షర్ పటేల్ ను పక్కనపెట్టారు. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ను కూడా సెలెక్టర్లు తీసుకోలేదట. శ్రేయస్ అయ్యర్ ను తీసుకోవాలా వద్దా అనే చర్చలు జరుగుతున్నాయి. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైంది.

"ఈ సిరీస్ కఠినంగా ఉండే అవకాశం ఉండటం వల్ల, బలమైన కెప్టెన్ అవసరం అని బోర్డు భావిస్తోంది. అందుకే రోహిత్ పర్యటనకు వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది. మిడిలార్డర్ లో సర్ఫరాజ్ ఖాన్ సామర్థ్యంపై జట్టు మేనేజ్మెంట్ పెద్దగా నమ్మకం చూపడం లేదు. కరణ్ నాయర్, రజత్ పటీదార్ మంచి ఫామ్లో కూడా ఉన్నారు. వీరిలో కనీసం ఒకరు భారత్ 'ఏ' జట్టులో ఉండే అవకాశం ఉంది. శ్రేయస్ అయ్యర్ విషయానికి వస్తే, గతేడాది టెస్ట్ క్రికెట్లో అంతగా రాణించకపోవడంతో పక్కనపెట్టారు. తుది నిర్ణయం త్వరలోనే తీసుకుంటారు. " అని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.