IPL 2025: గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ బ్యాటర్లు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఐపీఎల్లో చరిత్ర సృష్టించారు. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుపై 200 పరుగుల లక్ష్య ఛేదనలో వారు వికెట్ కోల్పోకుండా లక్ష్యాన్ని సాధించి విజయం సాధించారు. వీరిద్దరూ తొలి వికెట్కు 205 పరుగులు చేశారు. దీని ద్వారా గుజరాత్ ఓపెనింగ్ బ్యాటర్లు ఐపీఎల్ చరిత్రలో పలు రికార్డులను సాధించారు.
ఐపీఎల్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత జోడీగా వారిద్దరు రికార్డు సృష్టించారు. ఈ ఏడాది వారిద్దరూ కలిసి 839 పరుగులు చేశారు. 2021లో శిఖర్ ధావన్, పృథ్వీ షా సాధించిన 744 పరుగుల రికార్డును వారు బద్దలు కొట్టారు. ఒకే ఛేజింగ్లో అత్యధిక భాగస్వామ్యం సాధించిన ప్రపంచ రికార్డును కూడా వారు సాధించారు. ఇది ఐపీఎల్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఒక లక్ష్యఛేదనలో నమోదైన భారీ పార్టనర్షిప్ ఇదే కావడం గమనార్హం. శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ వారి 205 పరుగులతో బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉన్న అత్యధిక పార్టనర్ షిప్(203) రికార్డును బ్రేక్ చేశారు.

మరో వైపు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఐపీఎల్ చరిత్రలో రెండు సార్లు 200 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో జోడీగా నిలిచారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ రెండు సార్లు 200 కంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వారు ఆ రికార్డును సమం చేసి రెండో స్థానంలో నిలిచారు.
ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన గుజరాత్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 65 బంతుల్లో 112 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. గుజరాత్ టైటాన్స్ తరఫున సాయి సుదర్శన్ 61 బంతుల్లో 108 పరుగులు, శుభ్మన్ గిల్ 53 బంతుల్లో 93 పరుగులు చేసి చివరి వరకు నాటౌట్గా నిలిచారు. గుజరాత్ టైటాన్స్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. సాయి సుదర్శన్ తన రెండో ఐపీఎల్ సెంచరీని సాధించాడు.