Shreyas Iyer: భారత వన్డే జట్టు వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డేలో అద్భుతమైన క్యాచ్ పట్టినప్పటికీ కిందపడటంతో అతని పక్కటెముకలకు తీవ్ర గాయం తగిలింది. ఆ గాయం వల్ల శ్రేయస్ అయ్యర్ తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. గాయం ఎంత తీవ్రమైందంటే శ్రేయస్ అయ్యర్ను ఐసీయూలో కూడా ఉంచాల్సి వచ్చింది. అయితే శ్రేయస్ అయ్యర్కు సర్జరీ జరిగిందనే వార్తలు వచ్చాయి. కానీ బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) కార్యదర్శి దేవజిత్ సైకియా కీలక విషయాలు వెల్లడించారు. శ్రేయస్ అయ్యర్కు సర్జరీ జరగలేదని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు. "శ్రేయస్కు సర్జరీ జరగలేదు, కానీ అతను ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా చికిత్స పొందాడు. అందుకే అతను ఇంత త్వరగా కోలుకోగలిగాడు" అని తెలిపారు. "శ్రేయస్ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. వైద్యులు ఊహించిన దానికంటే అతని కోలుకునే వేగం చాలా వేగంగా ఉంది. అతను పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా 6 నుండి 8 వారాలు పట్టవచ్చు, కానీ అతను అంతకంటే ముందే కోలుకునే అవకాశం ఉంది." అని ఆయన వెల్లడించారు.

"వైద్యులు అతని పురోగతి పట్ల చాలా సంతృప్తిగా ఉన్నారు. శ్రేయస్ తన సాధారణ దినచర్య పనులను ప్రారంభించాడు. అతని గాయం తీవ్రంగా ఉన్నప్పటికీ, అతను ఇప్పుడు కోలుకున్నాడు. ప్రమాదం నుంచి బయటపడ్డాడు. అందుకే శ్రేయస్ అయ్యర్ను ఐసీయూ నుంచి సాధారణ గదికి మార్చారు." అని దేవజిత్ సైకియా తెలిపారు.
అంతర్గత రక్తస్రావాన్ని ఎలా ఆపారు?
శ్రేయస్ అయ్యర్కు ఆస్ట్రేలియా బ్యాటర్ అలెక్స్ కేరీ క్యాచ్ పట్టే క్రమంలో కిందపడినప్పుడు అతని ప్లీహం చిట్లిపోవడం వల్ల అంతర్గత రక్తస్రావం జరిగింది. ఈ పరిస్థితి ప్రాణాపాయానికి దారితీసేది. బీసీసీఐ కార్యదర్శి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రక్తస్రావాన్ని ఆపడానికి శస్త్రచికిత్స లేకుండా ఒక ప్రత్యేక వైద్య విధానం ఉపయోగించారు. ఈ ప్రక్రియను 'ఎంబోలైజేషన్ ' అని పిలుస్తారు. దీనిలో రక్తస్రావం జరుగుతున్న భాగానికి రక్తాన్ని చేరవేసే చిన్న రక్తనాళాలను మూసివేసి తద్వారా రక్తస్రావాన్ని తక్షణమే నియంత్రించారు. శ్రేయస్ ప్రస్తుతం ఆస్పత్రిలో కోలుకుంటున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది.