హైదరాబాద్: ముంబైలోని వాంఖడె వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో జయంత్ యాదవ్ సాధించిన అద్భుతమైన సెంచరీని అతడి కుటుంబం ఆస్వాదించలేకపోయింది. తన మూడో టెస్టులోనే జయంత్ యాదవ్ కెప్టెన్ కోహ్లీతో కలిసి అసాధారణ ఇన్నింగ్స్ ఆడాడు.
జయంత్ యాదవ్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడుతుంటే అతడి కుటుంబం మాత్రం విషాదంలో మునిగిపోయింది. జయంత్ అమ్మమ్మ మరణించడమే అందుకు కారణంగా తెలిసింది. హర్యానాకు చెందిన ఈ ఆల్ రౌండర్ ఆటను టీవీలో చూస్తూ ఆనందంతో పొంగిపోతున్న అతని తండ్రి జైసింగ్ యాదవ్కు ఈ బ్యాడ్ న్యూస్ తెలిసింది.
'మా అబ్బాయి భారీస్కోరు చేస్తాడని మంచి భావనతో ఉన్నాను. అప్పుడు మా అత్తయ్య (జయంత్కు అమ్మమ్మ) మరణవార్త తెలియడంతో జలంధర్ బయల్దేరా. కాసేపటికే జయంత్ సెంచరీ చేశాడని ఫోనొచ్చింది. కొడుకు ప్రదర్శన పట్ల ఆనందపడాలో అత్తయ్య మరణంపట్ల దుఃఖించాలో తెలియలేదు' అని అతని తండ్రి అన్నాడు.

కెరీర్లో మూడో టెస్టు ఆడుతున్న జయంత్కు ఈ వార్త తెలిస్తే ఏకాగ్రత కోల్పోతాడని ఈ విషయాన్ని అతడికి తెలియనివ్వలేదని ఆయన వెల్లడించారు. కాగా, పదిహేడేళ్ల క్రితం ఓ విమాన ప్రమాదంలో జయంత్ యాదవ్ తల్లి మరణించింది. ఇదిలా ఉంటే ముంబై టెస్టులో 9వ స్ధానంలో బ్యాటింగ్కు వచ్చిన జయంత్ యాదవ్ 104 పరుగులు సాధించాడు.
భారత క్రికెట్ చరిత్రలో తొమ్మిది వికెట్ గా వచ్చి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. 196 బంతుల్లో 14 ఫోర్లతో సెంచరీ సాధించాడు. ఇంగ్లాండ్తో ప్రస్తుతం జరుగుతున్న సిరీస్లోనే అరంగేట్రం చేసిన జయంత్ అద్భుతమైన ఆల్ రౌండర్ పాత్ర పోషిస్తున్నాడు. కెప్టెన్ కోహ్లితో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని అందించాడు.

చివరికి 104 పరుగులు చేసి రషీద్ బౌలింగ్లో స్టంపౌటయ్యాడు. విరాట్తో కలిసి ఎనిమిదో వికెట్ కు 240 పరుగులు జోడించి మరో రికార్డు కూడా సృష్టించాడు. ఏ జట్టుపైనైనా టీమిండియా తరఫున ఎనిమిదో వికెట్కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం. ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న సిరిస్లో జయంత్ రాకతో టీమిండియాలో బలం మరింత పెరిగింది.
ముంబైలో కోహ్లీకి ధీటుగా షాట్లు ఆడుతూ అలరించాడు. తద్వారా జట్టుకు భారీ స్కోరు సాధ్యమైంది. 'ఒక దశలో షాట్కు షాట్ కొడుతూ జయంత్ నాతో సరితూగాడు' అని కోహ్లీ చెప్పాడంటే అతని బ్యాటింగ్ ఎలా ఉందో అర్థం మనం చేసుకోవచ్చు. స్వదేశంలో సుదీర్ఘ సీజన్ ముందుండడంతో జయంత్ ఇలాగే ఆడితే జట్టులో అతని స్థానానికి ఢోకా ఉండదు.