హైదరాబాద్: టీమిండియా ప్రధాన కోచ్గా అనిల్ కుంబ్లే రాజీనామాను భారత క్రికెట్కు దుర్దినంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ అభివర్ణించాడు. అనిల్ కుంబ్లేను అవమానకర రీతిలో సాగనంపడంపై సునీల్ గవాస్కర్ తీవ్రంగా మండిపడ్డాడు. కోచ్ను కాదు.. అతన్ని వ్యతిరేకించే ప్లేయర్స్ను టీమ్ నుంచి సాగనంపాలని గవాస్కర్ స్పష్టంచేశాడు.
ఇలా ప్లేయర్స్ చెప్పినట్లు కోచ్ను మార్చడం ఎలాంటి సంకేతాలను పంపిస్తుందో తేల్చుకోవాలని బోర్డుకు సూచించాడు. 'కెప్టెన్, కోచ్ మధ్య విభేదాల గురించి నాకు పెద్దగా తెలియదు. అయితే భారత క్రికెట్కు ఇది దుర్దినం. ఏ జట్టులోనైనా విభేదాలు సహజం. అయినా కుంబ్లే సాధించిన ఫలితాలు చూడాలి' అని అన్నాడు.
ఆటగాళ్లు చెప్పినట్లు ఉంటే ఉండండి.. లేదంటే కుంబ్లేలాగా వెళ్లిపోండి అన్న సంకేతం తర్వాతి కోచ్కు ఇచ్చినట్లు అవుతుందని గవాస్కర్ అన్నాడు. ఇది చాలాచాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించాడు. కుంబ్లే తన ఏడాది పదవీకాలంలో అద్భుతమైన విజయాలు టీమ్కు సాధించిపెట్టాడని, ప్లేయర్గా, వ్యక్తిగతంగా కూడా అతనో గొప్ప వ్యక్తి అని గవాస్కర్ కొనియాడాడు.
గంగూలీ, సచిన్, లక్ష్మణ్లతో కూడిన క్రికెట్ సలహా కమిటీ కోరిన తర్వాతైనా కుంబ్లే పదవిలో కొనసాగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'కమిటీ విశ్వాసం ఉంచినందున అనిల్ మరికొంత కాలం కొనసాగాల్సింది. అతడు ఆడే రోజుల్లో గాయానికి కట్టుకట్టుకొని బరిలోకి దిగిన ధీశాలి' అని అన్నాడు.

'కుంబ్లే లాంటి పోరాట యోధుడు ఇలా నిష్క్రమించడాన్ని తొలిసారి చూస్తున్నా. అలాంటిది ఈసారి అతడెందుకనో అదే పోరాట పటిమను ప్రదర్శించలేదు. అతడు మరింత బలంగా తిరిగొస్తాడని ఆశిస్తున్నా' అని గవాస్కర్ వ్యాఖ్యానించాడు.
'క్రికెట్ సలహా కమిటీ కెప్టెన్ విరాట్ కోహ్లీతో సమావేశమై సుదీర్ఘంగా చర్చించిందని నాకు తెలుసు. అనిల్ కుంబ్లే ఎంతో ఎక్స్ పీరియన్స్ కలిగిన ఆటగాడు, అతడి సేవలను అడ్మినిస్ట్రేటర్గా వినియోగించుకుంటే మంచిది. కోచ్ని ఎంపిక చేయడమే కాదు భారత జట్టుకు క్రికెట్ సలహా కమిటీ ఎంతో చేస్తుంది' అని గవాస్కర్ పేర్కొన్నాడు.
ఇదిలా ఉంటే భారత జట్టు శ్రీలంక పర్యటన కంటే ముందే కొత్త కోచ్ను నియమిస్తే బాగుంటుందని క్రికెట్ సలహా కమిటీకి గవాస్కర్ సూచించాడు.