IML 2025: ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ 2025లో భాగంగా 9వ మ్యాచ్ వడోదరలోని బీసీఏ స్టేడియంలో ఇండియా మాస్టర్స్, ఆస్ట్రేలియా మాస్టర్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ 95 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. అయితే ఇండియా మాస్టర్స్ జట్టు కెప్టెన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. మళ్లీ పాత జ్ఞాపకాలను తిరిగి తీసుకువచ్చాడు. టెండూల్కర్ బ్యాటింగ్ శైలి నేటికీ ఎంత ఫిట్ గా ఉన్నాడో చూపించింది.
27 బంతుల్లో అర్థ శతకం
51 ఏళ్ల సచిన్ టెండూల్కర్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తూ ఆస్ట్రేలియన్ బౌలర్లను చిత్తు చేశాడు. సచిన్ కేవలం 27 బంతుల్లోనే ఫోర్లు, సిక్సర్లతో తన అర్థసెంచరీని పూర్తి చేశాడు. అయితే సచిన్ 33 బంతుల్లో 64 పరుగులు చేసి ఔటయ్యాడు. జేవియర్ డోహెర్టీ బౌలింగ్ లో డేనియల్ క్రిస్టియన్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. మాస్టర్ బ్లాస్టర్ తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. ఈ అద్బుతమైన ఇన్నింగ్స్ ఉన్నప్పటికీ సచిన్ టెండూల్కర్ తన జట్టును విజయపథంలో నడిపించలేకపోయాడు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 270 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇండియా మాస్టర్స్ సాధించలేకపోయింది.

మ్యాచ్ ఇలా జరిగింది..
ఆస్ట్రేలియా మాస్టర్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇండియా మాస్టర్స్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 269 పరుగులు చేసి ఇండియా మాస్టర్స్ కు 270 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆస్ట్రేలియా మాస్టర్స్ కెప్టెన్ షేన్ వాట్సన్ 52 బంతుల్లో 110 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వాట్సన్ బ్యాట్ నుంచి 12 ఫోర్లు, 7 సిక్సర్లు వచ్చాయి. బెన్ డంక్ కూడా సెంచరీ సాధించాడు. బెన్ డంక్ 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. 270 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇండియా మాస్టర్స్ 174 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ క్రమంలో 95 పరుగుల తేడాతో మ్యాచ్ ను కోల్పోయింది. భారత్ తరపున సచిన్ కాకుండా యూసుఫ్ పఠాన్ 25 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ ఓడినా ఇండియా మాస్టర్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోనే ఉంది.