
ట్యాలెంట్ ఉన్న జట్టు..
ఒక పోడ్క్యాస్ట్లో మాట్లాడిన కిర్స్టన్.. 2007లో వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే భారత జట్టు వెనుతిరిగిన విషయాన్ని గుర్తుచేశాడు. దీంతో సచిన్ చాలా బాధపడ్డాడని, ఒకానొక సమయంలో రిటైర్ అయిపోవాలని అనుకున్నాడని చెప్పాడు. ఆ సమయంలో సచిన్ కూడా అంత గొప్ప ఫామ్లో లేకపోవడంతో అతని ఆలోచనలు ఎటో వెళ్లిపోయాయన్నాడు. భారత జట్టు చాలా ట్యాలెంట్ ఉన్న జట్టని, దాన్ని ప్రపంచాన్ని ఓడించే జట్టుగా ఎలా మార్చాలనేదే అప్పుడు తన ముందున్న సవాల్ అని చెప్పాడు.

భయాలు, అనుమానాలు..
'ఇంత ట్యాలెంట్ ఉన్న జట్టును ప్రపంచాన్ని ఓడించే టీంగా మార్చాలంటే.. ఎలాంటి లీడర్షిప్ కావాలి? అనేది నా ముందున్న మొదటి ప్రశ్న. అలాంటి పరిస్థితిలో అడుగు పెట్టే ప్రతి కోచ్ అలాంటి సవాల్నే ఎదుర్కొంటాడు. నేను జట్టుతో చేరినప్పుడు టీమిండియాలో చాలా భయాలు, అనుమానాలు ఉన్నాయి. చాలా మంది సంతోషంగా లేరు. కాబట్టి ఆటగాళ్లు అందర్నీ అర్థం చేసుకోవడం నాకు మరింత ముఖ్యంగా మారింది' అని కిర్స్టన్ వివరించాడు. 2007లో శ్రీలంక, బంగ్లాదేశ్ చేతిలో ఓడిన భారత జట్టు.. వరల్డ్ కప్ తొలి రౌండ్లోనే ఇంటి దారి పట్టింది. దీంతో అభిమానులే కాదు, జట్టు సభ్యులు కూడా తీవ్రమైన అసంతృప్తిలో పడిపోయారు.

సచిన్ సమస్య..
'ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ ఆ సమయంలో తీవ్రమైన బాధలో ఉన్నాడు. నేను టీంలో అడుగు పెట్టేసరికి అదే పరిస్థితి. తను ఇంకా చాలా ఆడగలనని సచిన్కు తెలుసు. కానీ ఆటను ఆస్వాదించలేకపోతున్నాడు. అసలు రిటైర్ అయిపోతే బాగుంటుందేమో అనుకుంటున్నాడు. అలాంటి సమయంలో అతనితో మాట్లాడి, జట్టుకు అతను ఎంత అవసరమో చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. జట్టు విజయాల్లో అతని పాత్ర ఎంతో కీలకం' అని కిర్స్టన్ చెప్పాడు. ఈ క్రమంలోనే మళ్లీ తన ఫామ్ అందుకున్న సచిన్.. 2011 వరల్డ్ కప్లో అద్భుతంగా రాణించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications












