
ముంబై: కరోనా వైరస్ మహమ్మారి ఇంకెంత మందిని బలితీసుకుంటుందో చెప్పే పరిస్థితి లేదు. ఇప్పటికే లక్షలాది మందిని బలిగొన్న కరోనా.. తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ స్నేహితుడి ప్రాణాలను సైతం తీసుకెళ్లింది. సచిన్ టెండూల్కర్కు అత్యంత సన్నిహిత స్నేహితుల్లో ఒకడైన విజయ్ షిర్కే కరోనా కారణంగా చనిపోయారు. కరోనా లక్షణాలతో తానే ఆస్పత్రిలో చేరిన విజయ్ షిర్కే (57) చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.
కరోనా కారణంగా ఇప్పటి వరకు ఇద్దరి స్నేహితులను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కోల్పోయారు. గత అక్టోబర్ నెలలో టెండూల్కర్ క్లోజ్ ఫ్రెండ్ అవి కదమ్ కూడా కరోనాతో చనిపోయారు. తాజగా విజయ్ షిర్కే మృతి చెందడంతో సచిన్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. విజయ్ షిర్కే ముంబై జట్టు మాజీ పేసర్. సచిన్తో కలిసి చాలా మ్యాచ్ల్లో ఆడారు. వినోద్ కాంబ్లీతో కూడా షిర్కే క్రికెట్ ఆడారు. షిర్కే 80వ దశకంలో సన్గ్రేస్ మాఫత్లాల్ తరఫున టెండూల్కర్, వినోద్ కాంబ్లితో కలిసి క్రికెట్ ఆడారు. కళ్యాణ్లో పుట్టి పెరిగిన షిర్కే.. ముంబై క్రికెట్ అసోసియేషన్ అండర్-17 జట్టుకు రెండేళ్ల పాటు కోచ్గా పని చేశారు.
స్నేహితుడి మరణంపై వినోద్ కాంబ్లీ స్పందించారు... 'ఇది ఎంతో విషాదకరమైన వార్త. నేను నా ప్రాణ స్నేహితుడిని కోల్పోవడం ఎంతో బాధాకరం. నేను, సచిన్ అతన్ని ముద్దుగా విజ్జా అని పిలిచేవాళ్లం. అతను ఎప్పుడు ఉల్లాసంగా, కష్టపడి పనిచేసే వ్యక్తి' అని ఆవేదన వ్యక్తం చేసారు. 'విజయ్ షిర్కే మంచి ఫాస్ట్ బౌలర్. మేం ఆడుకునే రోజుల్లో చాల అద్భుతంగా బౌలింగ్ వేసేవాడు. కొద్దీ రోజుల క్రితమే అతనితో మాట్లాడా. మేము ప్రతిరోజూ ఒకరికొకరు మెసేజ్ చేసుకుంటాం. కానీ గత మూడు-నాలుగు రోజుల నుంచి నాకు అతని నుంచి మెసేజ్ రావడం లేదు. ఇంతలోనే ఈ చేదువార్త వినాల్సి వచ్చింది' అని కాంబ్లీ బాధపడ్డారు.
విజయ్ షిర్కే మృతిపై మాజీ క్రికెటర్లు సలీల్ అంకోలా, సురు నాయక్, తదిరులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'మమ్మల్ని విడిచి చాలా త్వరగా వెళ్ళావు మిత్రమా. నీవు అక్కడ ప్రశాంతంగా ఉండాలి మిత్రమా. మీతో మైదానంలో, బయట గడిపిన గొప్ప సమయాన్ని మేము ఎప్పటికీ మరచిపోలేము' అని భారత మాజీ పేసర్, ప్రస్తుత చీఫ్ సెలెక్టర్ సలీల్ అంకోలా ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. షిర్కే మరణం ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసిఎ)కు మరో ఎదురు దెబ్బ.