న్యూఢిల్లీ: ఫ్రీడమ్ సిరిస్లో భాగంగా ఢిల్లీ వేదికగా జరగనున్న నాల్గవ టెస్టు మ్యాచ్కి ముఖ్య అతిథిగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ హాజరుకానున్నాడు. అంతేకాదు నాల్గవ టెస్టు మ్యాచ్లో మరో అరుదైన ఘట్టం నమోదు కానుంది. ఈ టెస్టు మ్యాచ్ సందర్భంగా భారత్కు రెండు సార్లు ప్రపంచ కప్ సాధించిన ఆటగాళ్లను సన్మానించనున్నారు.
ఈ ప్రతిపాదనను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బీసీసీఐ ముందు ఉంచగా, ఇందుకు బీసీసీఐ కూడా అనుమతిచ్చింది. దీంతో డిసెంబర్ 3 నుంచి ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో నాల్గవ టెస్టు మ్యాచ్ సందర్భంగా ఏర్పాటు కానున్న ప్రత్యేక కార్యక్రమంలో 1983, 2011 వరల్డ్ కప్ హీరోలను ఢిల్లీ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది.

1983 వరల్డ్ కప్ను కపిల్ దేవ్ సారధ్యంలోని జట్టు వెస్టిండిస్పై ఘన విజయం సాధించి భారత్కు తొలి వరల్డ్ కప్ను అందించారు. దీనిని క్రికెట్ అభిమానులు ముద్దుగా 'కపిల్ డెవిల్స్' డేగా పిలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇక 2011లో ముంబైలోని వాంఖెడ్ మైదానంలో శ్రీలంకతో జరిగిన వరల్డ్ కప్లో ధోని సేన విజయం సాధించింది.
ఈ సన్మాన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఢిల్లీ ప్రభుత్వం 1983, 2011 వరల్డ్ కప్ హీరోలకు ఆహ్వానాలను ఇప్పటికే పంపింది. కాగా, ఫ్రీడమ్ సిరిస్లో భాగంగా భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న చివరి టెస్టు మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఇప్పటికే సిరిస్ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.