హైదరాబాద్: లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టోర్నీ తుది దశకు చేరుకుంది. తనకెంతగానో కలిసొచ్చిన ఈ టోర్నీలో ఒక్క సెట్ కూడా కోల్పోకుండానే ఫైనల్కు దూసుకొచ్చాడు. సెమీ ఫైనల్లో థామస్ బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)ను ఓడించిన ఫెదరర్ ఆదివారం జరిగే టైటిల్ పోరులో మారిన్ సిలిచ్ (క్రొయేషియా)తో అమీతుమీ తేల్చుకోనున్నాడు.
రోజర్ ఫెదరర్కు ఇది 11వ వింబుల్డన్ ఫైనల్ కావడం విశేషం. 1974లో కెన్ రోజ్వెల్ తర్వాత వింబుల్డన్లో ఫైనల్ చేరిన పెద్ద వయస్కుడిగా రోజర్ ఫెదరర్ (35 ఏళ్లు) ఘనత సాధించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ సెమీస్లో మూడో సీడ్ ఫెడెక్స్ 7-6 (7/4), 7-6 (7/4), 6-4తో 11వ సీడ్ థామస్ బెర్డిచ్ (చెక్)పై ఘన విజయం సాధించాడు.
సచిన్ టెండూల్కర్కి టెన్నిస్ అంటే చాలా ఇష్టం. ఇక స్విస్ టెన్నిస్ స్టార్ రోజర్ ఫెదరర్ అంటే మరితం ఇష్టం. ఈ సెమీ ఫైనల్ మ్యాచ్ని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలితో కలిసి స్వయంగా వీక్షించాడు. సెమీ ఫైనల్ మ్యాచ్కి హాజరైన సందర్భంగా సచిన్ మీడియాతో మాట్లాడాడు.
'నేను టెన్నిస్ ఆటకి వీరాభిమానిని. రోజర్ ఫెదరర్కి మద్దతు తెలిపేందుకు వచ్చాను. గత పదేళ్లుగా అతని ఆటని ప్రత్యక్షంగా వీక్షిస్తున్నాను' అని సచిన్ పేర్కొన్నాడు. ఇదిలా ఉంటే వింబుల్డన్ టోర్నీ ఏడుసార్లు విజేతగా నిలిచిన రోజర్ తనను ఐదేళ్లుగా ఊరిస్తున్న ఎనిమిదో టైటిల్తో పీట్ సంప్రాస్ రికార్డును బద్దలు కొట్టేందుకు విజయం దూరంలో నిలిచాడు.
ఇక టోర్నీలో భాగంగా శనివారం సాయంత్రం మహిళల సింగిల్స్ ఫైనల్ జరగనుంది. ఫైనల్లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్, స్పెయిన్కు చెందిన ముగురుజాతో తలపడుతుంది. ఇప్పటికే ఐదు సార్లు వింబుల్డన్ టైటిల్ గెలిచిన వీనస్ విలియమ్స్ తన ఆరో టైటిల్ కోసం పోటీ పడుతుంది.
వీనస్ చివరిసారి 2009లో వింబుల్డన్ ఫైనల్ చేరుకుంది. ఆ తర్వాత ఆమెకిది రెండో గ్రాండ్స్లామ్ ఫైనల్ మాత్రమే. వీనస్ విలియమ్స్ గెలిస్తే ఓపెన్ శకం (1968 నుంచి)లో మహిళల గ్రాండ్స్లామ్ టైటిల్ సాధించిన అతి పెద్ద వయసు క్రీడాకారిణిగా చరిత్ర సృష్టిస్తుంది.
ముగురుజా ఇదే వింబుల్డన్ వేదికపై 2015లో ఫైనల్లో ఓటమిపాలైంది. దీంతో ముగురుజా రెండోసారి వింబుల్డన్ ఫైనల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. మరోవైపు ముగురుజా గెలిస్తే వింబుల్డన్ వేదికపై కొత్త చాంపియన్గా అవతరిస్తుంది.