ముంబై: క్రికెట్ దిగ్గజం, రాజ్యసభ ఎంపీ సచిన్ టెండూల్కర్ మహారాష్ట్రలోని కరవు బాధిత మరఠ్వాడ రైతులకు ఆపన్నహస్తం అందించాలనుకుంటున్నారు. ఇటీవలే ఆయన వ్యక్తిగత సహాయకుడు నారాయణ్ కన్నన్ కరవు బాధిత బీడ్ జిల్లాలో పర్యటించారు. అంతేగాక, స్థానిక కలెక్టర్ నావల్కిశోర్ రామ్ను కలిసి అక్కడి స్థితిగతులపై సమాచారం సేకరించారు.
మరఠ్వాడా ప్రాంతంలోని 8 జిల్లాల్లో బీడ్ ఒకటి. ఈ జిల్లాలో కరువు కారణంగా 2015లో 1,100మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే సచిన్ సూచనల మేరకు అతని సహాయకుడు నారాయణ్ జిల్లా కలెక్టర్ను కలిశారు.
'సచిన్ స్వతంత్రంగా పనులు చేయాలనకుంటున్నారు. తను చేపట్టబోయే ప్రాజెక్టుల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారు' అని కన్నన్ మీడియాతో అన్నారు.

కరవు బాధిత రైతులకు సచిన్ సాయం అందించాలని భావిస్తున్నారని బీడ్ కలెక్టర్ కార్యాలయ వర్గాలు కూడా తెలిపాయి. వారికి కావాల్సిన సమాచారం అందిస్తున్నామని వెల్లడించాయి. సచన్.. తాగునీటి సరఫరా, సాగునీటి సౌకర్యం, విద్యుత్తు పంపిణీ, రహదారుల నిర్మాణం తదితర పనులు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నాయి.
బాలీవుడ్ నటుడు నానా పటేకర్, మరాఠ నటుడు మకరంద్ అనస్పురే కలిసి 'నామ్' సంస్థ పేరిట మరఠ్వాడ రైతులకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. మరో ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆత్మహత్యలు చేసుకున్న రైతు కుటుంబాల కోసం రూ. 90లక్షలను పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. మరో నటుడు అమీర్ ఖాన్ 'పానీ ఫౌండేషన్' ద్వారా కరువును ఎదుర్కొంటున్న రైతుల కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తోంది.