న్యూఢిల్లీ: నిషేధానికి గురైన భారత మహిళా బాక్సర్ సరితా దేవికి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ బాసటగా నిలిచారు. ఆసియా క్రీడల్లో కాంస్య పతకం నిరాకరించి సస్పెన్షన్కు గురైన ఆమెకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇవ్వాలంటూ సచిన్ టెండూల్కర్ ఓ లేఖ కూడా రాశారు.
పతకం నిరాకరించడం పట్ల సరితా దేవి ఇప్పటికే క్షమాపణ చెప్పిందని, ఆమెపై సస్పెన్షన్ను ఎత్తివేసే దిశగా చర్యలు తీసుకోవాలని క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్కు రాసిన లేఖలో సచిన్ టెండూల్కర్ కోరారు.

సరితా దేవికి పూర్తి మద్దతు ఇవ్వాలని, ఆమె కెరీర్ ప్రమాదంలో పడే పరిస్థితి నుంచి కాపాడాలని సచిన్ విజ్ఞప్తి చేశారు. ఆమెకు మద్దతుగా ప్రభుత్వం నిలబడాలని సచిన్ టెండూల్కర్ కోరారు.
కేంద్రమంత్రి నేతృత్వంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్, బాక్సింగ్ ఇండియా నుంచి సీనియర్ అధికారులతో టాక్స్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఆమెకు మద్దతుగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఆసియా క్రీడల బాక్సింగ్లో ఓ బౌట్లో తనకు అన్యాయం జరిగిందంటూ సరితా దేవీ తనకు లభించిన పతకం నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో ప్రపంచ భాక్సింగ్ సంఘం ఆమెపై సస్పెన్షన్ వేటు వేసింది.