హైదరాబాద్: కొద్ది సంవత్సరాలుగా భారత్ తన పొరుగు దేశమైన పాకిస్థాన్తో ఆడటం మానేసింది. ఈ క్రమంలో ఇరుదేశాల క్రికెట్ అభిమానులు ఆ ఉత్కంఠభరితమైన పోటీకి చాన్నాళ్లుగా దూరమైయ్యారు. అంతేకాదు దాయాది దేశపు ఆటగాళ్లంటే కాస్తంత ఉద్వేగాన్ని కూడా ప్రదర్శిస్తుంటారు. ఇదంతా కేవలం అభిమానుల వరకే ప్లేయర్లుగా మాకెలాంటి విద్వేషాలుండవు. సోదరభావంతో కలిసిపోతుంటాం. అని ఒకప్పటి ఓపెనర్ ద్వయం సచిన్, సెహ్వాగ్లు చెప్పుకొస్తున్నారు.
'వాట్ ద డక్' టీవీ షోలో మాట్లాడిన ఈ ఇద్దరు మాజీ క్రికెటర్లు.. అప్పటి పాక్ కెప్టెన్ ఇంజిమామ్ ఉల్ హక్ గురించి ఆసక్తికరమైన విషయాల్ని వెల్లడించారు. 'నేను, ఇంజిమామ్ ఎప్పుడూ సోదర భావంతోనే ఉండేవాళ్లం. అతను సోదరుడి కోసం ఏదైనా చేసేవాడు' అని సెహ్వాగ్ వెల్లడించాడు.
'లాహోర్లో ప్రాక్టీస్ సెషన్లో నేను ఉండగా.. ఇంజిమామ్ తన కొడుకుని తీసుకుని అక్కడికి వచ్చాడు. మా అబ్బాయి మీకు వీరాభిమాని అంటూ పరిచయం చేశాడు. పాకిస్థాన్ జట్టుకి కెప్టెన్గా ఉంటూ.. తన కొడుకు అదీ చిరకాల ప్రత్యర్థిగా ఉన్న భారత జట్టు ఆటగాడిని అభిమానిస్తుంటే దాన్ని స్వాగతించడం చాలా గొప్ప విషయం. ఇంజిమామ్ ఎప్పుడూ మాతో గౌరవంగానే వ్యవహరించేవాడు' అని సచిన్ టెండూల్కర్ గుర్తు చేసుకున్నాడు.
దశాబ్దం కిందట కూడా ఇరు జట్ల మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉండేదంటూ భారత మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొని వివరించారు. గత ఏడాది ఇంగ్లాండ్ వేదికగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు పాక్ చేతిలో ఓడినా.. విరాట్ కోహ్లి, యువరాజ్ సింగ్, హార్దిక్ పాండ్య తదితరులు దాయాది ఆటగాళ్లతో కలిసి మైదానంలో సరదాగా కనిపించారు.