హైదరాబాద్: భారత ఓపెనింగ్ క్రికెట్కు వారిద్దరూ వెన్నుముకలా నిలిచారు. వారిద్దరి భాగస్వామ్యంలో ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం సృష్టించారు. ముఖ్యంగా టీమిండియా ఐసీసీ వరల్డ్ కప్ 2003 గెలకపోయినా అప్పటి టోర్నీలో ఈ ఇద్దరూ పరుగుల సునామీనే సృష్టించారు.
వాళ్లే క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్, డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్. 2003 ఐసీసీ వరల్డ్ కప్లో వీరి బ్యాటింగ్ విన్యాసాలను మరిచపోలేం. 93 ఇన్నింగ్స్ల్లో ఈ జోడీ 42.13 యావరేజితో 3919 పరుగులు చేశారు. అందులో 18 అర్ధ సెంచరీలు, 12 సెంచరీలు ఉన్నాయి.
వీరిద్దరి అత్యధిక ఓపెనింగ్ భాగస్వామ్యం 182 పరుగులు. ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుపడే సెహ్వాగ్ దూకుడు స్వభావం సచిన్పై చాలా వరకు ఒత్తిడిని తగ్గించేది. సౌరభ్ గంగూలీ నేతృత్వంలోని టీమిండియా బలమైన వన్డే జట్టుగా మారడంలో వీరిద్దరి పాత్ర అమోఘం.

అయితే ఎన్నో సంవత్సరాల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన వీరిద్దరూ క్రికెట్కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరేంద్ర సెహ్వాగ్ ట్విట్టర్లో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించారు. ఇక సచిన్ సైతం ట్విట్టర్లో తన భావాలను వ్యక్తం చేస్తూ అభిమానులకు చేరువలో ఉంటున్నాడు.
ఇటీవలే హర్యానాలోని సెహ్వాగ్ ప్రారంభించిన క్రికెట్ పాఠశాలను క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సందర్శించాడు. ఈ సందర్భంగా వారిద్దరూ కలిసి తీసుకున్న సెల్ఫీని, వారి మధ్య జరిగిన సరదా సంభాషణలను ట్విటర్ ద్వారా సెహ్వాగ్ అభిమానులతో పంచుకున్నాడు.
ఇటీవల ఢిల్లీ వెళ్లిన సచిన్ వీరూను కలిశాడు. ఈ ఆనందంలో సచిన్తో కలిసి సెల్ఫీ దిగిన వీరూ.. ఢిల్లీలో గాడ్ జీ దర్శనం అంటూ ట్వీట్ చేశాడు. అయితే సచిన్ను కలిసిన ఆనందంలో ఉన్న సెహ్వాగ్ తీసుకున్న సెల్ఫీ కాస్త బ్లర్ అయ్యింది. అయినా అదేమీ పట్టించుకోకుండా ట్వీట్ చేశాడు.
వీరూ ట్వీట్ను చూసిన సచిన్.. అర్రే సెహ్వాగ్.. కొద్దిసేపు ఆగితే ఈ ఫొటోను ఉపయోగించుకునేవాడివి కదా.. అంటూ సెహ్వాగ్తో తను కలిసి దిగిన ఫొటోను ట్వీట్ చేశాడు. సచిన్ ఉంచిన ఫొటో క్వాలిటీ బాగుంది. మిమ్మల్ని కలిసిన తొందరలో అలా ఫొటోను షేర్ చేశానంటూ వీరూ బదులిచ్చాడు.