హైదరాబాద్: సెలబ్రిటీలు అయినా సరే సోషల్ మీడియాలో తప్పు చేస్తే ట్రోల్ చేయాల్సిందే. తప్పుగా ట్వీట్ చేస్తే అభిమానులు తమదైన శైలిలో ట్రోల్ చేస్తున్న సందర్భాలు అనేకం. తాజాగా ఈ జాబితాలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేరారు. అందుకు కారణం సోమవారం సచిన్ చేసిన ఓ ట్వీట్.
కాన్పూర్ వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్లో చివరకు భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. దీంతో మూడు వన్డేల సిరిస్ను భారత్ 2-1తో కైవసం చేసుకుంది. ఈ సిరిస్ విజయం భారత్కు వరుసగా ఏడో సిరిస్ విజయం కావడం విశేషం.
కాన్పూర్లో భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన చివరి వన్డే ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగుతుందని, నువ్వా-నేనా అన్నట్టు సాగే ఈ మ్యాచ్లో భారత్దే విజయమని మ్యాచ్ ముగిసిన తర్వాత సచిన్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అయితే మ్యాచ్ జరిగింది ఆదివారం అయితే సచిన్ మాత్రం ఆలస్యంగా సోమవారం ట్వీట్ చేశారు.
దీంతో నెటిజన్లు సచిన్ను ట్రోల్ చేశారు. సచిన్ అంత సరిగ్గా ఎలా ఊహించాడంటూ నెటిజన్లు వ్యంగ్యంగా ట్వీట్లు చేస్తున్నారు. 'సర్ మీరు చూస్తున్నది రిపీట్ టెలికాస్టా?' అని ఒక నెటిజన్ ప్రశ్నించగా, మరొకరు 'సచిన్ నువ్వు దేవుడివి. వచ్చే ఏడాది జరిగే సిరీస్ను కూడా నీవు చూడగలవు' అని వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.
ఇంకొక నెజిటన్ 'సర్ ముందు మీ సెటప్ బాక్స్ మార్చుకోండి' అంటూ ట్వీట్ చేశాడు. కాన్పూర్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 337 పరుగులు చేయగా.... అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నిర్ణీత ఓవర్లలో న్యూజిలాండ్ 7 వికెట్లు కోల్పోయి 331 పరుగులు మాత్రమే చేయగలిగింది.