Sachin Tendulkar:ఐపీఎల్ రూల్స్ పై సచిన్ సంచలన కామెంట్స్ - పుల్ల పెట్టేశాడా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL)అంటే ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న స్పోర్ట్గా గుర్తింపు పొందింది. 2008లో ప్రారంభమైన ఈ టోర్నీ.. ఇప్పటి వరకు 19 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకుందంటే మామూలు విషయం కాదు. అయితే ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి కాలానుగుణంగా ఆట నిబంధనల్లో మార్పులు చేర్పులు జరుగుతూ వచ్చాయి. ఈ మార్పులు చేర్పులకు చాలామంది మద్దతు తెలిపినప్పటికీ.. మరికొంతమందిలో మాత్రం ఈ నిబంధనల పట్ల అసంతృప్తే ఉంది. అడపాదడపా తమ నిబంధనలపై అసంతృప్తిని బయటపెట్టినప్పటికీ అది ప్రధాన వార్తల్లో నిలిచేది కాదు. అయితే ఈసారి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ రూల్స్ పై తన అసంతృప్తిని స్వయంగా బయటపెట్టడంతో ప్రధాన హెడ్లైన్స్గా నిలిచింది. ఇంతకీ సచిన్ ఏమన్నారు..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అంటేనే బ్యాటర్ల రాజరాజ్యం. భారీ సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తే ఈ ఫార్మాట్లో బౌలర్లు పాపం ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటారు. దీనికి తోడు 2023లో తీసుకొచ్చిన 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ బౌలర్ల పాలిట శాపంగా మారింది. ఇప్పటికే దీనిపై పలువురు ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేయగా, తాజాగా క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సైతం ఈ రూల్పై విరుచుకుపడ్డారు. ఐపీఎల్లో ఈ నియమాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూనే.. బౌలర్లకు మేలు జరిగేలా కొన్ని విప్లవాత్మక మార్పులను ప్రతిపాదించారు.

ఇంపాక్ట్ ప్లేయర్ కాన్సెప్ట్ వద్దు
ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో (ESPNcricinfo) అవార్డుల కార్యక్రమంలో సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ.. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల ఆటలో సమతుల్యత దెబ్బతింటుందని స్పష్టం చేశారు. "నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఐపీఎల్ నుండి 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ను తీసేయాలి. టి20 ఫార్మాట్లో ఆడేదే 20 ఓవర్లు. అందులో ఇప్పటికే బౌలర్లు తీవ్ర సవాళ్లు ఎదుర్కొంటున్నారు. అలాంటిది ఈ రూల్ ఉపయోగించి జట్లు అదనంగా ఒక బ్యాటర్ను లైన్అప్లోకి తెచ్చుకుంటున్నాయి. ఇది బ్యాటింగ్ను మరింత బలోపేతం చేస్తూ, బౌలర్లను ఒత్తిడిలోకి నెడుతోంది" అని సచిన్ ఆవేదన వ్యక్తం చేశారు.
సచిన్ మాస్టర్ ప్లాన్: పవర్ప్లేలో సరికొత్త ట్విస్ట్
ప్రస్తుతం ఉన్న 6 ఓవర్ల బ్యాటింగ్ పవర్ప్లే స్థానంలో సచిన్ ఒక అద్భుతమైన మార్పును సూచించారు. దాని ప్రకారం పవర్ ప్లేను 4 ఓవర్లకు కుదించి ప్రస్తుతం ఉన్నట్లుగానే 30 యార్డ్ సర్కిల్ బయట ఇద్దరు ఫీల్డర్లను పెట్టుకోవచ్చు. మిగిలిన రెండు ఓవర్లు బౌలింగ్ పవర్ ప్లేగా గుర్తించాలన్నారు.ఈ రెండు ఓవర్లను ఫీల్డింగ్ కెప్టెన్ మ్యాచ్లో ఎప్పుడైనా, ఏ దశలోనైనా వరుసగా వాడుకోవచ్చు. ఈ రెండు ఓవర్లలో సర్కిల్ వెలుపల అదనంగా మరో ఫీల్డర్ను (మొత్తం ముగ్గురిని) ఉంచుకునే అవకాశం ఇవ్వాలి. దీనివల్ల ఫీల్డింగ్ టీమ్ ఆటకు బ్రేకులు వేస్తూ, మ్యాచ్ను తమ నియంత్రణలోకి తెచ్చుకోగలదని సచిన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఒక్క బౌలర్కు 5 ఓవర్లు ఇవ్వాలి
సాధారణంగా టి20ల్లో ఒక బౌలర్ గరిష్టంగా 4 ఓవర్లు మాత్రమే వేయగలడు. కానీ సచిన్ ఇక్కడ కూడా ఒక క్రేజీ మార్పును కోరారు. "టాప్ ఆర్డర్ బ్యాటర్లు అవసరమైతే మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేస్తున్నారు. మరి బౌలర్లకు ఎందుకు ఆ అవకాశం ఉండకూడదు? కాబట్టి, ఇన్నింగ్స్లో ఒక బెస్ట్ బౌలర్కు 5 ఓవర్లు బౌలింగ్ చేసే కోటా ఇవ్వాలి" అని సచిన్ ప్రతిపాదించారు.
సచిన్ మాటల్లో ఎంత నిజముంది?
సచిన్ చేసిన ప్రతిపాదనలు క్రికెట్ ప్రపంచంలో సరికొత్త చర్చకు దారితీశాయి. నిజానికి 'ఇంపాక్ట్ ప్లేయర్' రూల్ వచ్చినప్పటి నుండి ఐపీఎల్లో 250+ స్కోర్లు సర్వసాధారణం అయిపోయాయి. 8వ నంబర్ బ్యాటర్ కూడా వచ్చి సిక్సర్లు బాదుతుండటంతో బౌలర్లకు ఎక్కడ బంతులు వేయాలో అర్థం కావడం లేదు.
సచిన్ చెప్పినట్లు ఒక బౌలర్కు 5 ఓవర్ల ఛాన్స్ ఇస్తే.. జట్లు తమ ప్రధాన బౌలర్ను (ఉదాహరణకు జస్ప్రీత్ బుమ్రా లాంటి వారిని) డెత్ ఓవర్లలో లేదా పవర్ప్లేలో మరింత సమర్థవంతంగా వాడుకోవచ్చు. అలాగే పవర్ప్లేను స్ప్లిట్ చేయడం వల్ల కెప్టెన్ల వ్యూహాలకు పదును పెరుగుతుంది. ఇది కేవలం ఫోర్లు, సిక్సర్ల వన్-సైడ్ గేమ్లా కాకుండా, బ్యాట్ మరియు బాల్ మధ్య ఉత్కంఠభరితమైన పోరాటంగా మారుతుంది.
క్రికెట్లో ఎప్పుడూ బ్యాటర్లకే కాకుండా బౌలర్లకు కూడా సమాన అవకాశాలు ఉండాలనేది సచిన్ టెండూల్కర్ ఆశయం. ఐపీఎల్ మేనేజ్మెంట్,బీసీసీఐ (BCCI) కమర్షియల్ యాంగిల్లో మాత్రమే కాకుండా, ఆట సజీవంగా ఉండాలనే ఉద్దేశంతో సచిన్ చేసిన ఈ అమూల్యమైన సూచనలను పరిశీలిస్తుందేమో చూడాలి. ఒకవేళ ఈ మార్పులు కనుక అమల్లోకి వస్తే, భవిష్యత్తులో ఐపీఎల్ మరింత రసవత్తరంగా మారడం ఖాయం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications