బెంగళూరు: కేరళకు చెందిన ఓ వీరాభిమాని.. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్కు ఓ లేఖ రాసింది. ఆమె లేఖకు ముగ్ధుడైన సచిన్ టెండూల్కర్ ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతూ తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. దీనిపై నెటిజన్లు కూడా స్పందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.
'మీ కాలంలో పుట్టినందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది' అని అంజనా అనే కేరళకు చెందిన వీరాభిమాని.. సచిన్ టెండూల్కర్కు రాసిన లేఖలో పేర్కొన్నారు. సచిన్ టెండూల్కర్ వ్యక్తిత్వం ఎంతో ఉన్నతంగా ఉంటుందని, అందుకే ఆయనను ఇష్టపడేవారు భారీ సంఖ్యలో ఉన్నారని చెప్పారు.

'నాకు ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు. ఎందుకంటే నేను రాస్తున్నది క్రికెట్ దేవుడి గురించి. నేను రాసిన ఈ లేఖ ఆయన(సచిన్)కు చేరుతుందో లేదో తెలియదు. కానీ, చేరుతుందనే అనుకుంటున్నా' అని ఆమె తన లేఖను ప్రారంభించారు.
అంతేగాక, 'నేను అంజన. కేరళకు చెందిన నేను ప్లస్ 2 చదువుతున్నాను. నేను మీరు(సచిన్) క్రికెట్ ఆడుతున్న కాలంలోనే పుట్టడం నా అదృష్టం. అందుకు నేను గర్వపడుతున్నా. మీ ప్రతిభే కాదు, మీ ఉన్నతమైన వ్యక్తిత్వం వల్లే మీకు ఇంత భారీ ఎత్తున అభిమానులున్నారు' అని సచిన్ గురించి ఆమె వివరించారు.
అంతేగాక, కేరళ వచ్చినప్పుడు తమ ఇంటికి తప్పక రావాలని సచిన్ ను ఆమె కోరారు.
కాగా, టెండూల్కర్.. ఆమె లేఖను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసి ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఆమె లాంటి అభిమానులుండటం తన అదృష్టమని చెప్పారు. ఆమెలాంటి చాలా మంది అభిమానులు తనకు స్ఫూర్తినిచ్చారని సచిన్ చెప్పారు.