
ముంబై: టీమిండియా మాజీ క్రికెటర్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. విషయాన్ని ఆయనే స్వయంగా ఈరోజు ఉదయం ట్విట్టర్లో వెల్లడించారు. ఇటీవల నిత్యం కరోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నాని, కరోనాకు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆ ట్వీట్లో సచిన్ తెలిపారు. ఐతే సచిన్కు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. వైద్యులు నిరంతరం ఆయను పరీక్షిస్తున్నారు.
'ఇటీవల నిత్యం కరోనా టెస్టింగ్ చేయించుకుంటూనే ఉన్నాను. కరోనాకు దూరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఏదేమైనా ఈరోజు నిర్వహించిన టెస్టింగ్లో కరోనా పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి. ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి నెగటివ్గా వచ్చింది. ఇంట్లోనే క్వారెంటైన్లో ఉన్నాను. డాక్టర్లు ఇచ్చిన సూచనల ప్రకారమే అన్ని మార్గదర్శకాలను పాటిస్తున్నా. నాతో పాటు దేశంలోని అనేక మందికి మద్దతు ఇస్తున్న హెల్త్కేర్ ప్రొఫెషనల్స్కు థ్యాంక్స్ చెబుతున్నా' అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
సచిన్ టెండూల్కర్ ఇటీవలే ముగిసిన రోడ్ సేప్టీ వరల్డ్ టీ20 సిరీస్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ సిరీస్లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ ఫైనల్లో శ్రీలంక లెజెండ్స్పై విజయం సాదించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 181 పరుగులు చేసింది. యువరాజ్ సింగ్ (41 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్లతో 60), యూసఫ్ పఠాన్ (36 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) హాఫ్ సెంచరీలతో దుమ్మురేపగా.. సచిన్ (23 బంతుల్లో 5 ఫోర్లతో 30)మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. అనంతరం శ్రీలంక 20 ఓవర్లలో 7 వికెట్లకు 167 పరుగులు చేసి ఓడింది.
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదాడు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్గా సచిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.