తిరువనంతపురం: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కేరళ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న 'విముక్తి' కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, లిక్కర్కు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం 'విముక్తి' పేరిట అవగాహన కార్యక్రమాలు చేపట్టనుంది.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్ధన మేరకు నవంబర్ 20న జరిగే ప్రారంభోత్సవానికి సచిన్ ముఖ్య అతిథిగా రానున్నట్లు ఆ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి టీపీ రామకృష్ణన్ సోమవారం శాసనసభలో ప్రకటించారు. మాదకద్రవ్యాలు, మద్యపానం, నికోటిన్తో కూడిన పదార్థాలు తీసుకోకుండా ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సచిన్ సేవలను వినియోగించుకోనునట్లు ఆయన తెలిపారు.

'విముక్తి' మిషన్ పేరిట నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి స్టాక్ హోల్డర్స్, ఉమెన్స్ సెల్ప్ హెల్ప్ గ్రూప్ కుటుంబశ్రీతో పాటు రాష్ట్రంలోని 700 కళాశాలలు, చాలా పాఠశాలల్లో మాదక ద్రవ్యాల వ్యతిరేక సంఘాలను ప్రభుత్వం ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
ఈ ఏడాది జూన్లో కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ను సచివాలయంలో క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ మర్యాద పూర్వకంగా కలిసిన నేపథ్యంలో ఈ 'విముక్తి' మిషన్ గురించి పూర్తిగా సచిన్కు వివరించడం జరిగిందని సచివాలయ వర్గాలు వెల్లడించాయి.