న్యూఢిల్లీ/లండన్: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంటే ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్కు అమితమైన గౌరవం. యువరాజ్ అంటే కూడా సచిన్కు అభిమానం. ఈ నేపథ్యంలో యువీ తన ముందించిన ఓ విన్నప్పాని సచిన్ మన్నించి పూర్తి చేశాడు. అంతేగాక, యువ క్రికెటర్లకు సర్ప్రైజ్ ఇచ్చారు.
ఆ విన్నపం ఏంటంటే తన క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న యువకులకు క్రికెట్ మెళకువలు తెలపాలని. యువీ విన్నపంతో లండన్ పర్యటనలో ఉన్న సచిన్ టెండూల్కర్.. అక్కడేవున్న 20 మంది అండర్-17 క్రికెటర్లను కలిశాడు.
దీంతో వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యాడు. క్రికెట్ దేవుడు తమ వద్దకు వచ్చి.. మెళకువలు చెప్పడంతో ఆ యువ క్రికెటర్లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

వివరాల్లోకి వెళితే.. యువరాజ్ సింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ అకాడమీకి చెందిన అండర్-17 క్రికెటర్లు ప్రత్యేక శిక్షణ కోసం లండన్ వెళ్లారు. అదే సమయంలో వింబుల్డన్ కోసం సచిన్ టెండూల్కర్ కూడా అక్కడి వెళ్లాడు.
ఈ విషయం తెలుసుకున్న యువరాజ్.. వెంటనే సచిన్ టెండూల్కర్ను సంప్రదించాడు. తన శిష్యులకు క్రికెట్ మెళకువలు బోధించాలని కోరాడు. తనకు విధేయుడైన యువీ విజ్ఞప్తికి సచిన్ వెంటనే ఓకే చెప్పేశాడు. ఈ క్రమంలో ఆ యువ క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా విఖ్యాత లార్డ్స్ స్టేడియంలో నెట్ సెషన్ నిర్వహించి తన అనుభవ పాఠాలను వారికి చెప్పాడు సచిన్.