
ముంబై: టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండ్కులర్ మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నాడు. పోషకాహార లోపం, నిర్లక్ష్యరాస్యతతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులను ఆదుకునేందుకు సచిన్ ముందుకు వచ్చాడు. ఓ ఎన్టీజీవోతో చేతులు కలిపి 560 మంది విద్యార్థులకు అండగా నిలిచాడు. ఇప్పటికే సచిన్ ఎంతో మంది ప్రజలు, విద్యార్థులకు సాయం చేసిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి పోరాటంకు కూడా అండగా నిలిచాడు.
మధ్యప్రదేశ్లోని సెహోర్ జిల్లాలోని మారుమాల గ్రామాల్లోని సెవానియా, బీల్పాటి, ఖాపా, నయాపుర, జమున్ ఝిల్లోని గిరిజన తెగలకు చెందిన చిన్నారులకు సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ పోషకాహారం, విద్యను అందించనుంది. ఎన్టీఓ పరివార్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సచిన్ ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నాడు. క్రికెట్ దిగ్గజం అట్టడుగు వర్గాలకు చెందిన చిన్నారులను ఆదుకునేందుకు ముందుకురావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
యూనిసెఫ్కు గుడ్విల్ అంబాసిడర్గా క్రికెట్ దిగ్గజం సచిన్ కొనసాగుతున్నాడు. ఇప్పటికే పిల్లలకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఇటీవల ముంబైలోని ఎస్ఆర్సీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్లో పలువురు నిరుపేదలకు చిన్నారులకు ఆర్థిక సహకారం అందించాడు. 2019 డిసెంబర్లో సచిన్.. స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్ దియా ఫౌండేషన్ ద్వారా డిజిటల్ తరగతి గదులను నడపడానికి గ్రీన్ ఎనర్జీని అందించడానికి సౌర లైటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఇక ముంబైలోని భివాలిలోని శ్రీ గాడ్గే మహారాజ్ ఆశ్రమ పాఠశాలలో ఆధునిక లర్నింగ్ సదుపాయాలతో పాటు క్రీడల నిర్వహణకు వసతులు కల్పించాడు.
అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ టెండూల్కర్ అగ్రస్థానంలో నిలిచాడు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు చేశాడు. టెస్టుల్లో 15,921.. వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ బాదాడు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్గా సచిన్ చరిత్ర సృష్టించాడు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్లో దక్షిణాఫ్రికాపై 147 బంతుల్లో 200 పరుగులు పూర్తిచేశాడు. 2012 మార్చి 16న శతకం బాది.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో వంద శతకాలు బాదిన ఏకైక క్రికెటర్గా నిలిచాడు. 2012 డిసెంబర్లో వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన సచిన్.. 2013 అక్టోబర్లో టీ20లకు, 2013 నవంబర్ 13న అన్ని ఫార్మాట్ల క్రికెట్కు వీడ్కోలు పలికాడు.