అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొన్నారు
తాజాగా ఇయాన్ చాపెల్ ఓ స్పోర్ట్స్ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'కోహ్లీ-రోహిత్ వన్డేల్లో భారత్ అత్యుత్తమ జోడీ అన్న వాదన బలంగా వినిపిస్తోంది. 15 ఏళ్లపాటు సచిన్-గంగూలీలు ప్రపంచ మేటి బౌలర్లను ఎదుర్కొన్న విషయాన్ని గుర్తించాలి' అని చాపెల్ గుర్తుచేశారు. వారు ఆడిన రోజుల్లో ప్రపంచంలోని ప్రతి క్రికెట్ జట్టులో నాణ్యమైన పేస్ బౌలర్లున్నారన్నారు.
అత్యుత్తమ జోడీ వారే
'అంతర్జాతీయ క్రికెట్ అత్యుత్తమ బౌలర్లు ఉన్న సమయంలో సచిన్-గంగూలీ ఆడారు. పాకిస్థాన్ నుంచి వసీం అక్రమ్-వకార్ యూనిస్, విండీస్ నుంచి ఆంబ్రోస్-వాల్ష్, ఆస్ట్రేలియా నుంచి మెక్గ్రాత్-బ్రెట్ లీ, శ్రీలంక నుంచి మలింగ-వాస్, దక్షిణాఫ్రికా నుంచి డొనాల్డ్-పొలాక్ ఇలా అన్ని దేశాల నుంచి అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొని పరుగులు చేశారు. అందుకే వారే అత్యుత్తమ జోడీ అంటున్నా' అని చాపెల్ వివరించారు.
రోహిత్ అద్భుతం
'వన్డే, టీ20ల్లో 50కుపైగా బ్యాటింగ్ సగటుతో కోహ్లీ అసాధారణమైన రీతిలో ఆడుతున్నాడు. నిజం చెప్పాలంటే సచిన్ చాలా తక్కువ టీ20 క్రికెట్ ఆడాడు. ఈ ఫార్మాట్ వచ్చే సమయానికి గంగూలీ కెరీర్ ముగిసింది. నలుగురు అద్భుతమైన బ్యాట్స్మన్ల ఆటను చూసే అవకాశం దక్కడం భారత అభిమానుల అదృష్టం. రోహిత్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ఇక మనం స్టాండ్స్ వైపే చూడాలి. క్రిస్ గేల్లా పటిష్ట కండరాల శక్తి లేకపోయినా.. సునాయాసంగా చాలా సిక్సులు కొడుతున్నాడు. మంచి స్ట్రైక్ రేట్ ఉంది' అని చాపెల్ కొనియాడారు.