
హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన చిన్ననాటి మధుర స్మృతుల్ని ట్విట్టర్లో అభిమానులతో పంచుకున్నాడు. తన స్కూల్మేట్, టీమిండియా మాజీ క్రెకెటర్ వినోద్ కాంబ్లీతో ఉన్న ఓ పాత ఫొటోను ట్విటర్లో శనివారం తన ట్విట్టర్లో పోస్టు చేశాడు. వినోద్ కాంబ్లీని సచిన్ ముద్దుగా 'కాంబ్ల్యా' అని పిలిచే సంగతి తెలిసిందే.
ఈ ఫోటో కింద ''కాంబ్ల్యా ఈ ఫొటో సంపాదించాడు. ఆ పాత చిలిపి జ్ఞాపకాలు మదిలో మెదిలేలా చేశాడు. స్కూల్ డేస్ అన్నీ ఒక్కసారే కళ్లముందు కదలాడాయి" అంటూ సచిన్ కామెంట్ పోస్టు చేశాడు.
సచిన్ ట్వీట్కు స్పందించిన కాంబ్లీ ఆ ఫొటో వెనకున్న కథ విప్పాడు. "మాస్టర్..! నేనూ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఓ కైట్ వచ్చి పిచ్ మధ్యలో పడింది. దాన్ని పక్కన పడేసి నా పని నేను చూసుకోకుండా... ఎగరేయడం మొదలెట్టాను. అది గమనించిన మా కోచ్ రమాకాంత్ అచ్రేకర్ నావైపు కోపంగా వస్తున్నారు. ఆయన వస్తున్నది నేను గమనించలేదు. సార్ రావడం చూసినప్పటికీ నువ్వు నాకు చెప్పలేదు. తర్వాత ఏం జరగిందో తెలుసుగా" అని ట్వీట్ చేశాడు.
ఇదిలా ఉంటే సచిన్, కాంబ్లీలు శారదాశ్రమం విద్యామందిర్లో పాఠశాల విద్యను అభ్యసించారు. కోచ్ రమాకాంత్ ఆచ్రేకర్ సూచన మేరకే వారు ఆ స్కూళ్లో చేరారు. పాఠశాల స్థాయి క్రికెట్ టోర్నీలో 1988, ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్లో 664 పరుగుల రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు.
హరీస్ షీల్డ్ టోర్నీలో సెయింట్ జేవియర్ స్కూల్పై వీరిద్దరూ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్లో సచిన్ టెండూల్కర్ 326 పరుగులు చేయగా.. వినోద్ కాంబ్లీ 349 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఈ రికార్డుని కొన్నేళ్ల పాటు ఎవరూ బద్దలు కొట్టలేదు.