న్యూఢిల్లీ: యావత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సచిన్ టెండూల్కర్ ఆత్మకథ విడుదలైంది. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన ఆత్మకథ "ప్లేయింగ్ ఇట్స్ మై వే" పుస్తకాని బుధవారం విడుదల చేశారు.
పుస్తకం విడుదల చేసి తొలి కాపీని తన తల్లి రజనీకి అందజేశారు. అనంతరం సచిన్ టెండూల్కర్ మాట్లాడుతూ తన తొలికాపీని అందుకున్నప్పుడు అమ్మ మొహంలో కనిపించిన ఆనందం వెలకట్టలేనిదని ట్విట్టర్లో ట్వీట్ చేశారు. తన తొలికాపీని తల్లికి ఇస్తున్న ఫోటోను సైతం ట్వీట్ చేశాడు.
సచిన్ మాట్లాడుతూ ఈ పుస్తకం రాయడం మొదలుపెట్టినప్పుడు ఎంత సమయం పడుతుందో తనకి తెలియలేదని అన్నారు. ఈ జీవితంలోని విశేషాలన్నింటిని ఈ పుస్తక రూపంలోకి తెచ్చేందుకు మూడేళ్లు సమయం పడితే అందుకు కృషి చేసిన బోరియా ముుజుందార్కి కృతజ్ఞతలు అన్నారు.
పబ్లిసిటీ కోసం తన ఆత్మకథను రాయలేదన్న సచిన్. 24 ఏళ్ల తన క్రికెట్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నానని అన్నాడు. ఈ పుస్తకంలో అన్ని అనుభవాలను పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. గత 41 సంవత్సరాలు నా జీవితంలో జరిగిన అన్ని అనుభవాలను నా గురించి తెలుసుకోవాలని ఆసక్తిగా ఉన్న అందరి ముందుకు తీసుకొచ్చానని అన్నారు.
జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు గురించి ఇందులో పొందుపరిచానని అన్నారు. బార్బడా టెస్టు మ్యాచ్లో విఫలమైన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకొవాలని భావించాను అని సచిన్ తెలపడంతో ఈ పుస్తకానికి అభిమానుల్లో ఆసక్తి వచ్చింది. సచిన్ కెరీర్లోని ఎత్తుపల్లాలు, అనుభవాలు కలగలిసిన ఈ పుస్తకం ఆదరణ పొందుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

అంతర్జాతీయ క్రికెట్లో ఎన్నో రికార్డులను తన పేరు మీద నమోదు చేసుకున్న సచిన్.. కెరీర్లో 200వ టెస్టు మ్యాచ్ ఆడిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్కు గుడ్బై చెప్పాడు.
ఈ పుస్తకంలో టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ ఓ రింగ్ మాస్టర్ అంటూ ఆరోపణలు చేశాడు. ఈ ఆరోపణలకు సౌరవ్ గంగూలీ, వీవీఎస్ లక్ష్మణ్, జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్ వంటి సీనియర్లు సైతం సచిన్ కు మద్దతుగా వ్యాఖ్యలు చేయడం కూడా పుస్తకం చదవాలని అందరిలోనూ ఆసక్తిని పెంచింది.