

హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా తొలి సిరీస్లో విజయాన్ని అందుకుంది టీమిండియా. సిరీస్కు నిర్ణయాత్మక మ్యాచ్ ఆదివారం జరిగింది. మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా బ్రిస్టల్ కౌంటీ గ్రౌండ్ వేదికగా జరుగుతున్న మూడో టీ-20 మ్యాచ్లో టీమిండియా వీరోచిత ఇన్నింగ్స్తో అదరగొట్టింది. రోహిత్ శర్మ వీరోచిత సెంచరీ, చివర్లో హార్థిక్ మెరుపులు కలగలిసి భారత్కు విజయాన్ని కట్టబెట్టాయి. ఇంగ్లండ్ ఆటగాళ్లకు ముచ్చటలు పట్టించిన మన క్రికెటర్లు సిరీస్ను ఎగురేసుకుపోయారు.
అయితే ఈ మ్యాచ్కి ముందే టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ జోస్యం చెప్పారు. ఈ మ్యాచ్లో భారత్ బ్యాటింగ్ ప్రారంభించిన కొంతసమయానికే సచిన్ భారత్ ఈ లక్ష్యాన్ని 19 ఓవర్లలోపే చేధిస్తుందని ట్వీట్ చేశారు. దీన్ని ఎంతమంది అంగీకరిస్తారని ఆయన ఓ పోల్ని కూడా నిర్వహించారు. సచిన్ అన్నట్లుగానే భారత జట్టు 18.4 ఓవర్లలోనే 201 పరుగులు చేసి విజేతగా నిలిచింది. దీంతో సచిన్ మ్యాచ్ అనంతరం మరో ట్వీట్ పెట్టి అందులో రోహిత్కి థ్యాంక్స్ చెప్పారు.
'ఎంతటి క్లీన్ హిట్టింగ్ రోహిత్. ఈ ఇన్నింగ్స్ చూడటంతో ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఇదే ఫాం వన్డేల్లో కూడా కొనసాగుతుందని అనుకుంటున్నా.. నా 19వ ఓవర్ జోస్యాన్ని నిజం చేసినందుకు థ్యాంక్స్' అని సచిన్ పేర్కొన్నారు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 198 పరుగులు చేయగా.. రోహిత్, కోహ్లీ, పాండ్యాల వీరోచిత బ్యాటింగ్తో భారత్ 18.4 ఓవర్లలో 201 పరుగులు చేసి విజేతగా నిలిచింది.
దీంతో.. మూడు టీ20ల సిరీస్ని భారత్ 2-1తో చేజిక్కించుకుంది. భారత్కి ఇది వరుసగా ఆరో టీ20 సిరీస్ విజయం. టీమిండియా తన తదుపరి సిరీస్లో భాగంగా గురువారం మొదటి వన్డే ఆడనుంది. ఈ మూడు వన్డేల సిరీస్కు తొలి మ్యాచ్కు నాటింగ్షైర్ స్టేడియం వేదిక కానుంది.