నెల్లూరు: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ వ్యక్తిగత కార్యదర్శి మనోజ్ వారియా గురువారం నాటు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజువారికండ్రిగ గ్రామాన్ని సందర్శించారు. సచిన్ ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఆయన 16వ తేదీన ఇక్కడకు రానున్నారు.
ఈ నేపథ్యంలో ఆయన పీఏ మనోజ్ వారియా మాస్టర్ దత్తత తీసుకున్న గ్రామాన్ని సందర్శించారు. సచిన్ రాక పైన గ్రామస్థులతో చర్చించారు. గ్రామాన్ని పరిశీలించారు. పదహారవ తేదీన సచిన్ గ్రామానికి రానున్నట్లు ఆయన తెలిపారు.

కాగా, నెల్లూరు జిల్లా గూడూరులోని పుట్టంరాజువారికండ్రిగ గ్రామానికి రాజ్యసభ సభ్యుడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నవంబర్ 16న వస్తున్నట్లు నెల్లూరు జిల్లా కలెక్టర్ జి రేఖావాణి పదిహేను రోజుల క్రితం చెప్పారు. అక్టోబర్ 31, శుక్రవారం ఆమె తన ఛాంబర్లో విలేకర్లతో ఈ విషయమై మాట్లాడారు.
నవంబర్ 15న సాయంత్రం 5 గంటలకు సచిన్ ముంబై నుంచి చెన్నై చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో కృష్ణపట్నం పోర్టుకు వస్తారని చెప్పారు. ఆ రాత్రికి అక్కడే బస చేసి మర్నాడు ఉదయం 9 గంటలకు గూడూరులోని గ్రామానికి చేరుకుంటారన్నారు.
గ్రామంలో రూ.3.50 కోట్లతో ఆ గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులను సచిన్ తన చేతుల మీదగా ప్రారంభిస్తాడు. మధ్యాహ్నాం 12 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్తారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో భాగంగా సవాల్ను స్వీకరించిన సచిన్ ఈ గ్రామాన్ని 'సన్సద్ ఆదర్శ్ గ్రామ్ యోచన' క్రింద ఈ గ్రామాన్ని దత్తతు తీసుకున్నారు.
ఈ గ్రామాన్ని అందంగా తీర్చిదిద్దడంతోపాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా సమకూర్చనున్నారు. పుట్టంరాజువారికండ్రిగ గ్రామంలో 24 గంటలపాటు అందుబాటులో తాగునీరు, వీధిలైట్లు, రోడ్లు, డ్రైనేజీ, చెత్తనిర్మూలన వ్యవస్థ, శ్మశానం, సెల్ఫోన్ టవర్లు, వైఫై జోన్, బ్యాంకు, ఆరోగ్య కేంద్రం, పశు వైద్యశాలను నిర్మిస్తారు.