ముంబై: సచిన్ టెండూల్కర్ ఓ క్రికెట్ లెజెండ్. తన అద్భుతమైన ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నాడు. సచిన్పై అభిమానుం చాటుకునేందుకు వయసుతో పనిలేదు. అంతేకాదు చిన్న వాళ్ల నుంచి వయసు మళ్లిన వారు కూడా సచిన్ను ఎంతగానో ఇష్టపడతారు.
అందుకే ఆయన అభిమానులుగా 5 ఏళ్ల వయసు నుంచి 93 ఏళ్ల బామ్మలు కూడా ఉన్నారు. సచిన్ అభిమానుల్లో అత్యంత పెద్ద వయస్కురాలైన మేరీ సెరావో (93) శనివారం మృతి చెందారు. ఆమె మృతి పట్ల ట్విట్టర్లో సచిన్ నివాళి అర్పించాడు. మేరీ సెరావోకు సచిన్ అంటే ఎంతో ఇష్టం.

ఈ క్రమంలో సచిన్ను కలిసేందుకు ఆమె చేయని ప్రయత్నం లేదు. చివరికి 2009లో మెహబూబ్ స్డూడియాలో ఓ కమర్షియల్ యాడ్ చిత్రీకరణ సమయంలో ఆమెకు తన అభిమాన క్రికెటర్ను కలసుకునే అవకాశం వచ్చింది. అంతేకాదు సచిన్ పుట్టనరోజైన ఏప్రిల్ 24వ తేదీనే మేరీ సెరావో పుట్టడం విశేషం.
దీంతో సచిన్తో కలిసి ఆమె తన పుట్టినరోజుని జరుపుకుంది. ఈ సందర్భంగా సచిన్ ఆమెను ఆహ్వానించి కొంత సమయం గడిపాడు. సచిన్ టెండూల్కర్పై ఇష్టంతో వయసును సైతం లెక్కచేయకుండా 2013లో వెస్టిండీస్తో ఆడిన చివరి అంతర్జాతీయ టెస్టు (200)ను ఆమె ముంబైలోని వాంఖడె మైదానంలో ప్రత్యక్షంగా వీక్షించింది.