హైదరాబాద్: క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ సోమవారం న్యూఢిల్లీలోని సెహ్వాగ్ క్రికెట్ అకాడమీని సందర్శించాడు. అక్కడ క్రికెట్ పాఠాలు నేర్చుకుంటున్న యువకులను కలిసి వారి సందేహాలకు సమాధానాలిచ్చాడు. ఇందులో భాగంగా జీవితంలో అపజయాలను ఎలా ఎదుర్కొవాలని ఓ విద్యార్ధి అడిగిన ప్రశ్నకు సచిన్ తనదైన శైలిలో జవాబిచ్చాడు.

'ముందు నువ్వు అపజయాల గురించి ఆలోచించడం మానేయ్యాలి. జీవితంలో నువ్వేమి సాధించాలని అనుకుంటున్నావో దానిపై దృష్టి పెట్టాలి' అని సచిన్ పేర్కొన్నాడు. ఒకానొక సమయంలో తాను పరుగులు చేయలేక ఇబ్బందులు పడ్డప్పుడు తన సోదరుడు ఇదే సలహా ఇచ్చినట్టు సచిన్ తెలిపాడు.
తన కొడుకు, కుమార్తెకు ఎప్పుడూ ఒక మాట చెబుతానని సచిన్ చెప్పాడు. అవేంటంటే 'మీకు రెండు అవకాశాలున్నాయి. మొదటిది ఉదయాన్నే లేవగానే మీకున్న వాటి గురించి దేవుడికి ధన్యవాదాలు చెప్పడం. రెండోది జీవితంలో మీకు లేని వాటి గురించి ఫిర్యాదు చేయడం' అని చెప్పాడు.
సచిన్ చెప్పిన ఈ జవాబుతో కూడిన వీడియోని సెహ్వాగ్ తన ట్విట్టర్లో పోస్టు చేయడంతో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్గా మారింది. ఇక ఓపెనింగ్ పెయిర్గా సచిన్, సెహ్వాగ్లు క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను నెలకొల్పిన సంగతి తెలిసిందే. పరిమిత ఓవర్ల క్రికెట్లో వీరిద్దరి ఓపెనింగ్ జోడీ 114 ఇన్నింగ్స్ల్లో 4,387 పరుగులు చేసి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే.