ముంబై: అంతర్జాతీయ క్రీడా ప్రపంచంలో సచిన్ టెండూల్కర్ మహా అధ్యాయం ముగిసింది. ఆయన మరో రెండు మ్యాచులు ఆడి టెస్టు క్రికెట్ నుంచి తప్పుకుంటున్నాడు. ఈ మేరకు ఆయన ప్రకటన చేశాడు. సచిన్ తన 200వ టెస్టు మ్యాచ్ నవంబర్ 14వ తేదీన ఆడుతాడు. అదే అతని చివరి అంతర్జాతీయ టెస్టు మ్యాచ్ అవుతుంది.
సచిన్ తమకు పంపిన ప్రకటనను బిసిసిఐ విడుదల చేసింది. సచిన్ టెండూల్కర్ బిసిసిఐ అధ్యక్షుడిని సంప్రదించి, తన ప్రకటననను మీడియాకు తన తరఫున విడుదల చేయాలని కోరాడు. ఆ ప్రకటన పాఠం ఇలా ఉంది.

బిసిసిఐకి పంపిన టెండూల్కర్ రిటైర్మెంట్ ప్రకటన
భారత్ కోసం క్రికెట్ ఆడాలని నేను జీవితమంతా కలలు గన్నాను. గత 24 ఏళ్లుగా తాను ఈ స్వప్నంతోనే జీవిస్తున్నాను. క్రికెట్ ఆడకుండా జీవించడాన్ని ఊహించుకోవడం దుర్భరమే. ఎందుకంటే 11 ఏళ్ల వయస్సు నుంచి నేను క్రికెట్ ఆడుతున్నాను. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం, ప్రపంచవ్యాప్తంగా ఆడడం నాకు ఎంతో గౌరవం. నా 200వ టెస్టు మ్యాచును నేను నా సొంత మైదానంలో ఆడదలుచుకున్నాను. దాంతోనే తప్పుకుంటాను.
సమయం వచ్చిందని నా హృదయం చెప్పినప్పుడు నన్ను అందుకు అంగీకరించినందుకు, ఏళ్లుగా నాకు ఎంతో చేసినందుకు బిసిసిఐకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సహనం వహించినందుకు, నన్ను అర్థం చేసుకున్నందుకు నా కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మైదానంలోకి అడుగు పెట్టి ఉత్తమంగా ఆడడానికి తనకు శక్తిని ఇవ్వడానికి ప్రార్థనలు చేసిన, ఆకాంక్షలు తెలిపిన నా అబిమానులకు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
బిసిసిఐ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసన్ ప్రకటన
చెన్నైలో ఆడడానికి వచ్చినప్పటి నుంచి నేను సచిన్ టెండూల్కర్ వీరాభిమానిని, అనుచరుడిని. అతను భారతదేశంలో పుట్టిన మహా క్రికెటర్ అని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. నిజానికి, అన్ని కాలాలకు చెందిన ప్రపంచ మహా క్రీడాకారుల్లో అతను ఉంటాడు. సచిన్ భారత క్రికెట్కు సేవలందించినంతగా మరొకరు అందించలేదు. భారతదేశానికి, భారత క్రికెట్కు ఆయన నిజమైన అంబాసిడర్. సచిన్ లేని భారత జట్టును మనలో చాలా మందిమి ఊహించుకోలేనప్పటికీ ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాం.