భుజాలపై మోసిన క్షణం:
టీమిండియా ప్రపంచకప్ గెలిచాక సచిన్ను సహచర ఆటగాళ్లు భుజాలపై ఎత్తుకొని వాంఖడే మైదానమంతా తిప్పిన దృశ్యం ఇప్పటికీ ఎవ్వరూ మరిచిపోరు. అయితే దాదాపు తొమ్మిదేండ్ల తర్వాత ఆ సందర్భం ప్రతిష్ఠాత్మక లారియస్ అవార్డుకు నామినేటైంది. 2000 నుంచి 2020 మధ్య క్రీడల్లో అత్యుత్తమంగా నిలిచిన 20 ఘటనలను నిర్వాహకులు నామినేట్ చేశారు. టీమిండియా గెలిచిన ఆ క్షణాన్ని మొత్తం దేశాభిమానుల ఆనందం కోణంలో లారెస్ 'క్యారీడ్ ఆన్ ద షోల్డర్స్ ఆఫ్ ఎ నేషన్' అని టైటిల్ పెట్టింది.
లారియస్ అవార్డు రేసులో సచిన్:
లారియస్ అవార్డు కోసం 20మంది పోటీలో ఉండగా.. సచిన్ కూడా రేసులో నిలిచాడు. ఈ విషయాన్ని లారియస్ అకాడమీ సభ్యుడు, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ వా ప్రకటించాడు. 'క్రికెట్లో అదో అద్భుతమైన సందర్భం. భారత్ సాధించిన గొప్ప విజయం' అని వా పేర్కొన్నాడు. ఆన్లైన్లో మూడు నాకౌట్ రౌండ్ల ఓటింగ్ ద్వారా విజేతను నిర్ణయిస్తారు. ఈనెల 10న ప్రారంభమైన ఆన్లైన్ ఓటింగ్.. ఫిబ్రవరి 16న ముగుస్తుంది. తుది విజేతను ఫిబ్రవరి 17న బెర్లిన్ (జర్మనీ)లో జరిగే కార్యక్రమంలో ప్రకటిస్తారు.
20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా:
ప్రపంచ క్రీడా రంగంలో లారెస్ స్పోర్టింగ్ అవార్డు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. మొనాకోకు చెందిన 'లారెస్ స్పోర్ట్ ఫర్ గుడ్ ఫౌండేషన్' క్రీడల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లు, జట్లకు ప్రతి ఏటా అవార్డులు ప్రదానం చేస్తోంది. ఈ సంస్థ ఆవిర్భవించి 20 సంవత్సరాలు అయిన సందర్భంగా.. 'లారెస్ స్పోర్టింగ్ మూమెంట్ 2000-2020' అవార్డు ఇవ్వాలని నిర్ణయించింది. గత రెండు దశాబ్దాల్లో క్రీడారంగంపై ముద్రవేసిన 20 అరుదైన ఘటనలలో భాగస్వాములైన ఆటగాళ్లతో లారెస్ ఓ జాబితా రూపొందించింది.